కర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తం
కర్నూలు : కర్రలు లేచాయి. తలలు పగిలాయి. బన్నీ ఉత్సవం ఎప్పటిలాగే ఈసారి కూడా రక్తసిక్తమైంది. తరతరాల ఆచారమంటూ కొనసాగుతున్న ఈ వేడుక సంబరాల్లో 11 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు. దసరా పండుగ రోజు దేవరగట్టు కొండ దగ్గర బన్నీ ఉత్సవం రణరంగం తలపిస్తుంది. అదే క్రమంలో ఈ విజయదశమికి కూడా ప్రజలు ఒక్క దగ్గర చేరి కర్రల సమరానికి సై అన్నారు. ఆ క్రమంలో 60 మందికి పైగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

దేవరగట్టు బన్నీ ఉత్సవం.. కర్రల సమరంలో తలలు పగిలి..!
కర్నూలు జిల్లా దేవరగట్టు కొండ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కర్రల సమరం జరిగి నలుగురి పరిస్థితి విషమంగా మారింది. ఇక్కడ వెలసిన మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్దం జరగడం ఆనవాయితీగా వస్తోంది. దసరా పండుగ నాడు దేవరగట్టు పరిధిలోని 11 గ్రామాల ప్రజలు ఇక్కడకు చేరుకుంటారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలు దక్కించుకోవడం కోసం కర్రల యుద్దం చేస్తుంటారు. ఆ క్రమంలో ఈసారి కూడా కర్రల సమరంలో తీవ్ర గాయాలై నలుగురి పరిస్థితి విషమంగా తయారైంది.

ఉత్సవ విగ్రహాల కోసం ఈ తంతు.. తరతరాల ఆచారమంటూ..!
కర్రలు చేతబట్టుకుని యుద్దానికి వెళుతున్నట్లుగా సిద్దమవుతారు ఇక్కడి ప్రజలు. మరికొందరేమో దివిటీలు చేతబట్టి అర్ధరాత్రి పూట కొండల నడుమ దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయలుదేరుతారు. ఆ క్రమంలో ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి 11 గ్రామాల ప్రజలు పోటీ పడతారు. అందులో భాగంగా కర్రలు గాల్లోకి లేస్తాయి. రాక్షస క్రీడను తలపించేలా ఒకరినొకరు కొట్టుకుంటూ ముందుకెళతారు. ఆ క్రమంలో తలలు పగలడం.. తీవ్ర గాయాలు కావడం పరిపాటిగా మారింది. ఇలాంటి రక్తపాతం వద్దని స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఎంత చెప్పినా ఇక్కడి ప్రజలు పట్టించుకోరు. ఆనవాయితీ, ఆచారం పేరిట ప్రతిసారి రక్తపాతం జరుగుతుండటం గమనార్హం.

కర్రల సమరంలో లక్ష మంది.. నలుగురి పరిస్థితి విషమం
బన్ని ఉత్సవం పేరిట జరిగే ఈ వేడుక ఇలా రక్తసిక్తం అవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దసరా అంటే జిల్లా వాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కర్రల సమరం గుర్తుకొస్తుంటుంది. అదే క్రమంలో ఈసారి కూడా మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ కర్రల సమరంలో దాదాపు లక్ష మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. విజయదశమి సందర్భంగా స్వామి వారి కల్యాణత్సోవం అనంతరం కర్రల యుద్దం బీభత్సంగా జరిగింది. పదకొండు గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి ఇష్టానుసారం కొట్టుకున్నారు.

ఎంత చెప్పినా మారని పరిస్థితి..!
దేవరగట్టు ఉత్సవం కాస్తా కర్రల సమరంగా పేరుగాంచింది. దసరా అంటే చాలు ఈ కర్రల యుద్దం గుర్తుకొస్తుంది. ఆనవాయితీ అంటూ సాగుతున్న ఈ రక్తపాతానికి గత కొన్నాళ్లుగా బ్రేక్ వేయాలని చూస్తున్నప్పటికీ వీలు కావడం లేదు. అటు పోలీసులతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఎంత నచ్చజెప్పాలని చూసినా.. కర్రల సమరం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. ఆచారాలు, సంప్రదాయాల పేరిట ఇలా కొట్టుకుంటుంటే భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామనేది ఎవరూ గ్రహించలేక పోతున్నారు.












Click it and Unblock the Notifications