జగన్ నోట తొలిసారిగా: కర్నూలే న్యాయ రాజధాని: ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు ఉయ్యాలవాడ పేరు
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోట.. తొలిసారిగా న్యాయ రాజధాని అనే మాట వెలువడింది. ప్రస్తుతం ఆయన కర్నూలులో పర్యటిస్తోన్నారు. కర్నూలు శివార్లలోని ఓర్వకల్లో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమౌతాయి. దీనికి సంబంధించిన టికెట్ల బుకింగ్ ఇదివరకే ఆరంభమైంది. ఈ సందర్భంగా విమానాశ్రయం వెలుపల ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు, కర్నూలు జిల్లాకే చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరును పెడుతున్నట్లు ప్రకటించారు.

ఎన్నికల ముందు హడావుడీగా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం హడావుడీగా విమానాశ్రయానికి రిబ్బన్ కటింగ్ చేసిందని విమర్శించారు. 2019 నాటి సాధారణ ఎన్నికలకు నెల రోజుల ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయాన్ని ప్రారంభించారని, ఎలాంటి సౌకర్యాలను కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. విమాన సర్వీసులు రాకపోకలు సాగించడానికి ఏమాత్రం వీల్లేని పరిస్థితుల్లో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే విమానాశ్రయం ప్రారంభించినట్లు చెప్పుకొన్నారన్నారని విమర్శించారు.

ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్..
ఇంకా రన్వే నిర్మాణంలో ఉండగానే విమానాన్ని ల్యాండ్ చేసి, డ్రామాలు ఆడారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈ నెల 20 నెలల కాలంలో ఎయిర్ పోర్ట్లో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేశామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్టు పనులు చేపట్టామని అన్నారు. ఒకేసారి నాలుగు విమానాలు పార్కింగ్ చేసుకునే సదుపాయాన్ని ఓర్వకల్లు ఎయిర్పోర్టులో కల్పించామని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, క్రమంగా వాటిని మిగిలిన నగరాలకు విస్తరింపజేస్తామని అన్నారు.

ఉయ్యాలవాడ పేరు..
కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయబోతున్నామని, అలాంటి చోట విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. కర్నూలు శివార్లలోని జగన్నాథ గట్టు వద్ద హైకోర్టు, టౌన్ షిప్ను నిర్మించడానికి 250 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన తరువాత.. తొలిసారిగా వైఎస్ జగన్ నోట.. న్యాయ రాజధాని అనే పేరు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నూలుజిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరును పెట్టబోతున్నామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే రైతాంగం పక్షాన పోరాడిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అని అన్నారు.

రాష్ట్రంలో ఆరో ఎయిర్పోర్ట్..
కర్నూలు-విశాఖపట్నం, కర్నూలు-చెన్నై, కర్నూలు-బెంగళూరులను రద్దీ మార్గాలుగా గుర్తించారు ఏపీ ఎయిర్పోర్ట్ అభివృద్ధి సంస్థ అధికారులు. తొలిదశలో ఈ మార్గాల్లోనే విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. దీనికి అవసరమైన బుకింగులు శుక్రవారం నుంచే ప్రారంభం అయ్యాయి. ఉడాన్ పథకంలో భాగంగా- ద్వితీయ శ్రేణి నగరాలకూ విమాన సర్వీసులను విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప, రాజమహేంద్రవరం సరసన కర్నూలు చేరింది.












Click it and Unblock the Notifications