ఆలయాలకు రక్షణ లేదు.. ఏపీ సర్కార్పై రాజా సింగ్ విసుర్లు..
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఏపీలో జిన్నా టవర్ గురించి విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో హిందువులకు గానీ హిందూ దేవాలయాలకు గాని రక్షణ లేదన్నారు. ఇవాళ కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
అల్లర్లు..?
రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. శ్రీశైలంలో అన్యమతస్తుల వ్యాపారాలు, వారి జనాభా రోజు రోజుకూ పెరుగుతోందని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నెం.426 తీసుకువచ్చి భక్తుల మనోభావాలు కాపాడారని గుర్తుచేశారు. శ్రీశైలంలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయడం వల్ల శ్రీశైల దేవాలయం గౌరవ మర్యాదలు దెబ్బతింటున్నాయని.. దీనిని ఎండోమెంట్ కమిషనర్, ఇతర అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
దుమారం..
జిన్నా టవర్ అంశంపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బీజేపీ జాతీయ స్థాయి నేత సత్యకుమార్ ఆజ్యం పోశారు. ఆయన గుంటూరు జిన్నా టవర్పై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. గుంటూరులో ఉన్న జిన్నా టవర్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన బీజేపీ నేత సత్య కుమార్.. 'ఈ టవర్కు జిన్నా పేరు మీద నామకరణం చేశారు. అంతేకాకుండా ఈ ఏరియాను జిన్నా సెంటర్గా పిలుస్తారు. ఇది ఉంది పాకిస్థాన్లో కాదు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో. దేశ ద్రోహి అయిన అలీజిన్నా పేరును ఇంకా టవర్కు కొనసాగిస్తున్నారు. ఈ టవర్కు భరత మాత ముద్దు బిడ్డ అయిన అబ్దుల్ కలాం పేరో, దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టరు.? ఒక సూచనగా చెబుతున్నాను' అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అదీ అగ్గిరాజేసింది. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.
రాజాసింగ్ రియాక్షన్
సత్య కుమార్ చేసిన ట్వీట్కు బిజేపీ నేతల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్ను కూలగొట్టండి అంటూ కామెంట్ చేశారు. వెంటనే ఆ పేరును తొలగించి స్వతంత్ర్య యోధుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.