జగన్ గారూ.. ఇదీ సరికాదు, అల్లరిమూకలపై చర్యలు తీసుకోవాల్సిందే: సోము వీర్రాజు
కర్నూలు జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హింసాత్మక ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో శోభాయాత్రపై రాళ్లదాడి జరిగితే ఏం చేస్తున్నారని సీఎం జగన్ను ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను పెంచి పోషించాలని అనుకుంటున్నారా అని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం మౌనంగా ఉన్నారని సంచలన ఆరోపించారు. ఇదీ మంచి పద్దతి కాదని ఆయన హితవు పలికారు.
ప్రజలకు రక్షణ కల్పించలేని వారు పాలకుడు ఎలా అవుతారు అని సోము వీర్రాజు మండిపడ్డారు. దీంతో ఇంక ఎంతమంది హిందువులు రక్తం చిందించాలని నిలదీశారు. ప్రతిపక్షాలను గృహనిర్బంధాల ద్వారా కట్టడి చేయడంలో మాత్రం పోలీసులు చక్కగా పనిచేస్తున్నారని విమర్శించారు. మరీ పౌరుల రక్షణను గాలికొదిలేస్తున్నారా అని అడిగారు. పరిస్థితులను కట్టడి చేసే సామర్థ్యం లేకపోగా, ప్రశ్నించేవారిపై మత రాజకీయ ముద్ర వేయడం ఏంటీ అని అడిగారు.
ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శోభాయాత్రపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమకు ప్రభుత్వం అండ ఉందనే భావనతో కొన్ని వర్గాల వికృత చేష్టలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. దీంతో కొందరు బలవుతున్నారని సోము వీర్రాజు తెలిపారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్, శ్రీశైలంలో దేవస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందువులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తానని స్పష్టంచేశారు. ప్రజాక్షేత్రంలో నిరంకుశ వైఖరిని ఎండగడతా అని సోము వీర్రాజు మండిపడ్డారు.
స్వేచ్చగా శోభాయాత్ర చేస్తే రాళ్లు రువ్వడం ఏంటీ అని సోమువీర్రాజు అడిగారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. దీంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై తాము పోరాడుతామని ఆయన స్పష్టంచేశారు. బాధ్యులపై విధిగా చర్యలు తీసుకోవాలని.. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.