పాలమూరులో తొలి టీకా కృష్ణకు.. షాపూర్ నగర్లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద
మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుడు కృష్ణ అనే వ్యక్తికి మొదటి టీకా వేశారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిందని, చాలా మంది వైద్యులు కూడా చనిపోయారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇదివరకు పేద ధనిక అనే తేడా లేకుండా పరిస్థితి ఉండేదని తెలిపారు. ప్రపంచంలో అదే భావన చిరస్థాయిగా ఉంటే చాలా బాగుంటుందని మంత్రి అన్నారు.
కరోనా వైరస్కు టీకా రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రపంచంలో ఆరు వందల కోట్ల మంది జనాభా ఉంటే.. అందులో రెండు వందల యాభై కోట్ల మందికి తెలంగాణ రాష్ట్రం నుంచే వ్యాక్సిన్ రావడం గర్వాంగా ఉందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనడంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు అభినందనీయులు అని తెలిపారు. కరోనా బారిన పడిన వెనకడుగు వేయకుండా పని చేశారని శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ఇటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కొవిడ్ యాప్లో నమోదు చేసుకున్నవారికి వైద్యులు, సిబ్బందికి వ్యాక్సిన్ అందజేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం 30 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, రంగారెడ్డి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.