కరోనా భయం... భర్తకు సోకిన కొద్దిరోజులకే తనకూ పాజిటివ్... ఊహించని నిర్ణయం తీసుకున్న భార్య...
భర్తకు కరోనా సోకిన కొద్దిరోజులకే తనకూ వైరస్ పాజిటివ్గా తేలడంతో... ఆందోళన చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా పట్ల సరైన అవగాహన లేకపోవడం,లేని పోని అపోహలే మహిళ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన సుద్దాల మొండయ్యకు రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్గా తేలింది. మొదట స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన్ను... ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో వారం రోజుల క్రితం మొండయ్య భార్య జలజ కూడా కరోనా బారినపడ్డారు. భర్తకు కరోనా సోకిందని తీవ్ర మనస్తాపం చెందిన ఆమె... తనకూ కరోనా సోకడంతో మరింత కుంగిపోయారు. లేని పోని అపోహలతో అనవసరంగా ఆందోళన చెందారు. మంగళవారం(ఏప్రిల్ 13) అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో వైరస్పై లేని పోని అనుమానాలు,అపోహలతో ఇలాగే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కరోనా సోకిందన్న అనుమానంతో కొందరు... కరోనా సోకిన తర్వాత మానసికంగా కుంగిపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ఏడాది కాలంగా కరోనా పట్ల ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... ప్రజల్లో ఇంకా భయాందోళన,అపోహలు వీడకపోవడం గమనార్హం.
మరోవైపు తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల క్రితం వరకూ 500 మార్క్కి కాస్త అటు ఇటుగా నమోదైన కేసులు ఇప్పుడు ఏకంగా 3వేల మార్క్కి అటు ఇటుగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మరో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. మరో 4959 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (ఏప్రిల్ 14) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1780కి చేరింది. ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 16,892 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 821 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,07,499కి చేరింది.
ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 88.89 శాతం ఉండగా తెలంగాణలో 91.86 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 361 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,02,10,906 కరోనా టెస్టులు నిర్వహించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,10,611 మంది మొదటి డోసు,3,12,340మందికి రెండో డోసు ఇచ్చారు. మంగళవారం(ఏప్రిల్ 13) ఒక్కరోజే 31,077 మందికి టీకా మొదటి డోసు,2506 మందికి టీకా రెండో డోసును ఇచ్చారు.