తిమ్మాయిపల్లిలో చిరుతపులి సంచారం, లేగదూడపై దాడి: భయంలో జనం
మెదక్: జిల్లాలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిమ్మాయిపల్లి గ్రామ పరిధిలో చిరుతపులి లేగ దూడపై దాడి చేసింది. విషయం తెలిసినప్పటి నుంచి గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరికొన్ని ప్రదేశాల్లో చిరుతపులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించారు.
చనిపోయిన లేగదూడను పరిశీలించి గ్రామస్తులకు జాగ్రత్తలు సూచించారు. కాగా, ఆ గ్రామంలో గతంలో కూడా చిరుత పులులు సంచరించాయని తెలిపారు. అయితే ఎప్పుడు ప్రాణనష్టం జరగలేదని అంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా లేగ దూడ చనిపోవడంతో ఆ గ్రామంతో పాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు.

వెంటనే ఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారి ఓం ప్రకాష్, బీట్ అధికారి చిరంజీవి సందర్శించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. రైతుకు ప్రభుత్వ తరఫు సాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. చిరుత పులి సంచారంపై ఎలాంటి భయాందోళన పడవద్దని.. అది గ్రామాల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. చిరుతను పట్టుకున్నేంత వరకు గ్రామంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. దాని జాడ తెలిస్తే వెంటనే అధికారులకి తెలియజేయాలని అన్నారు.
కాగా, చిరుత పులి ఒకవేళ దూరంగా ఎదురుపడితే అది మనపై దాడి చేసే అవకాశాలు తక్కువని.. అనుకోని సందర్భంలో దానికి సమీపంలో ఎదురుపడితే భయపడకుండా రెండు చేతులు పైకి ఎత్తి.. బిగ్గరగా అరవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దానికంటే పెద్ద జంతువు ఏదో ఉందని పక్కకి తప్పుకుంటాయి. సాధారణంగా చిరుతపులులు ఎదురుగా ఉన్నవారిపై దాడి చేసే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications