హుజూర్ నగర్ లో ఓటుకు నాలుగు వేలు ఇచ్చి గెలిచారన్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీని ఓడించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీ మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. ఇక టిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Huzurnagar by election results 2019: కాంగ్రెస్ ఓటమి ...టీడీపీ,బీజేపీల డిపాజిట్లు గల్లంతు
హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేతలు విజయం తమదేనని భావించారు. ప్రస్తుతం ఓటర్లు ఇచ్చిన తీర్పుకు షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీకి ఇది నిజమైన విజయం కాదని చెప్తున్న పరిస్థితి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పద్మావతి ఉత్తమ్ కుమార్ ఓటమి పాలు కావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నగర్ ఉప ఎన్నికల బాధ్యతను భుజాల మీద వేసుకొని పనిచేసినప్పటికీ విజయ సాధించలేకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్పందిస్తున్నారు.
ఓటుకు నాలుగు వేల రూపాయల చొప్పున పంచారు అని, ఓటర్లను ప్రలోభ పెట్టి సాధించిన విజయం విజయం గా లెక్కించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు కుమ్మరించి ఓటుకు 4000, 5000 రూపాయలు చొప్పున కొనుగోలు చేసి ఇప్పుడు ఓటర్లు తమ పక్షాన ఉన్నారని, గెలిచామని చెప్పుకోవడం ఒక గెలుపు కాదని, అందులో ఎలాంటి నైతికత లేదని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ గెలుపు గెలుపే కాదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.