రైతులను నిరుద్యోగులుగా మార్చి.. కేసీఆర్పై షర్మిల నిప్పులు
సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 23వ రోజు నకిరేకల్ నియోజకవర్గం పోతినేనిపల్లి క్రాస్ వద్ద పాదయాత్ర ప్రారంభించారు. ఆమె వెంట పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. పోతినేని క్రాస్ నుంచి నెమ్మని, జువ్విడిగూడెం, తిరుమల్ గిరి మీదుగా పాదయాత్ర సాగింది. అక్కడి నుంచి మాండ్ర గ్రామానికి చేరుకుని మాట- ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం వానిపాకల గ్రామానికి పాదయాత్ర చేరుకుంది.

సమస్యలు..
ఆయా గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లను సందర్శించారు. మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, టాయిలెట్లను పరిశీలించారు. బడుల్లో అధ్వాన పరిస్థితులు నెలకొనడంపై అసహనం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల బాధలు విని చలించి పోయారు. అప్పట్లో వైయస్ఆర్ చేనేత కార్మికులకు రూ.350 కోట్లు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం చేనేత రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని కార్మికులు వాపోయారు. తమకు పని కల్పించడం లేదని, ఒకవేళ చేసినా అరకొర వేతనం ఇస్తున్నారని కంటతడి పెట్టారు. రైతులు, గౌడన్నలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

అప్పుడు అలా..
వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 6 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించారు. రాయితీపై విత్తనాలు, ఎరువులు అందజేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన మొదటి నాయకుడు వైయస్ఆర్ అని. ఐదేండ్లలో ఒక్క పన్ను కూడా పెంచకుండా అద్భుతమైన పాలన అందించారని చెప్పారు. పేదింటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులు చదివించారు. వైయస్ హయాంలో పేదింటి బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించారు. 108, 104 అంబులెన్సుల ద్వారా వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. ఐదేండ్లలో మూడు సార్లు నోటిఫికేషన్లు వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారు

ఆత్మహత్యలు లేవే..?
వైయస్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. ఐదేండ్ల పాలనలో గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 46 లక్షల మందికి పక్కా ఇండ్లు నిర్మించారు. జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 86 ప్రాజెక్టులు నిర్మించారు. ఇవాళ కేసీఆర్ హయాంలో ధరలన్నీ పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. స్కూలు, కాలేజీ ఫీజులు భారీగా పెరిగిపోయాయి. పేదలకు ఉచిత విద్య దూరం చేశారు. రైతు బంధు ఎకరాకు రూ.5 వేలు ఇచ్చి, రూ.25 వేలు ఎగ్గొడుతున్నారు. రైతులకు ఉచిత ఎరువులు లేవు, ఇన్ పుట్ సబ్సిడీ లేదు. పంట పరిహారం లేదు. బోర్లు వేసుకుందాం అంటే సాయం చేయరు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రావు. కేసీఆర్ గారు రైతులను వరి వేయొద్దని చెప్పి రైతులను నిరుద్యోగులుగా మార్చాడు. మద్దత ధర ప్రకటించిన తర్వాత వరి వేసుకోవద్దని చెప్పడం దుర్మార్గం. మద్దతు ధర అంటేనే రైతులకు పంట వేసుకునే స్వేచ్ఛ ఉన్నట్టు అని చెప్పారు.

రైతు వ్యతిరేకి..
కేసీఆర్ ముమ్మాటికీ రైతు వ్యతిరేకి. రైతుల పాలిట యముడిలా తయారయ్యాడు. కేసీఆర్ పేదలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఒక్కరికీ ఇవ్వలేదు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు హమాలీ పనికి, కూలీ పనికి, కూరగాయలు అమ్మడానికి, చాయ్ అమ్మడానికి వెళ్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ? ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని మోసం చేశాడు. ఏడేండ్ల కాలంలో కేసీఆర్ వృద్ధులు, వికాలాంగుల వైపు కన్నెత్తి చూడలేదు. అర్హులైన వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం లేదు. వైయస్ అభయహస్తం పథకం తీసుకొస్తే.. ఆ పథకాన్ని నేటి పాలకులు రద్దు చేశారు. మహిళలు కట్టిన పైసలు కూడా తిరిగి చెల్లించలేదు. కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ప్రజలకు అన్యాయమే చేశారు.

దొంగ హామీలు
రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు వేయించుకోవడానికి కేసీఆర్ దొంగ హామీలు ఇస్తాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ మంచి నాయకుడయితే ఏడేండ్లలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. రైతులకు కనీసం నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా కేసీఆర్ ఇవ్వడం లేదు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. తెలంగాణ ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పాలకులను ప్రశ్నించలేదు. అందుకే YSR తెలంగాణ పార్టీ పెట్టామని షర్మిల తెలిపారు.












Click it and Unblock the Notifications