మునుగోడు బరిలో గద్దర్ - ఎవరూ ఊహించని పార్టీ నుంచి పోటీ..!!
నల్లగొండ: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతానికి రెండింటి చుట్టు తిరుగుతున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన జాతీయ పార్టీ.. రెండు- మునుగోడు ఉప ఎన్నిక. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పారు. దీనికి సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. హైదరాబాద్ మొత్తం గులాబీమయం అయింది. ఎటు చూసినా కేసీఆర్ బ్యానర్లు కనిపిస్తోన్నాయి.
ఇక నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేడి పతాక స్థాయికి చేరుకుంది. నోటిఫికేషన్ వెలువడటంతో అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం వల్ల ఉప ఎన్నిక అవసరమైంది. రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ నుంచి ఉప ఎన్నిక బరిలో నిలవడం ఖాయమైంది.
కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేస్తోన్నారు. టీఆర్ఎస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు వినిపించినప్పటికీ- పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరుగనుంది. 6వ తేదీన కౌంటింగ్ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. మునుగోడుతో పాటు మహారాష్ట్ర-అంధేరి ఈస్ట్, బిహార్-మొక్మా, గోపాల్ గంజ్, హర్యానా-ఆదంపూర్, ఉత్తర ప్రదేశ్-గోలా గోక్రనాథ్, ఒడిశా-ధామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నికను నిర్వహించడానికి ఈసీ ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా- మునుగోడు ఉప ఎన్నిక బరిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పోటీ చేయనున్నారు. కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీ నుంచి ఆయన ఉప ఎన్నిక బరిలో నిలిచారు. గద్దర్ అభ్యర్థిత్వాన్ని కొద్దిసేపటి కిందటే కేఏ పాల్ ఖరారు చేశారు. ప్రజా శాంతి పార్టీలో చేరిన వెంటనే గద్దర్ను మునుగోడు బైపోల్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న గద్దర్ను కేఏ పాల్ కలిశారు. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఆ వెంటనే గద్దర్ను మునుగోడు అభ్యర్థిగా ప్రకటించారు.