ఎస్టీలు, గొర్రెకాపరుల భూముల జోలికొస్తే ఊరుకోం: వైఎస్ షర్మిల
అక్రమ మైనింగ్ అంశంపై పోరాడుతామని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆత్మకూరులో గల ఎర్రబోళ్లు భూముల్ని రక్షిస్తామని చెప్పారు. ఆ నాటి సీఎం వైయస్ఆర్ ఎర్రబోళ్ల భూములు కాపాడితే.. కేసీఆర్ మైనింగ్ కోసం తాకట్టుపెట్టారని విమర్శించారు. పేదలకు అన్యాయం జరిగితే సహించబోమని తేల్చిచెప్పారు. ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల 35వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. ఎర్రబోళ్ల భూముల అన్యాక్రాంతంపై వైయస్ షర్మిల స్పందించారు.
127 ఎకరాల భూమి..
గ్రామంలో సర్వే నెంబర్ 279లో సుమారుగా 127ఎకరాల భూమి ఉందని, ఎళ్ల నుంచి ఆ భూముల్లో గిరిజనులు, గొర్రెకురుమలు బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఆ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్కు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైయస్ఆర్ భూములు కబ్జాకు గురికాకుండా, అటవీశాఖ స్వాధీనం చేసుకోకుండా కాపాడి, పేదల కోసం కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆ భూముల్ని ప్రైవేటు మైనింగ్ కు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని అవసరం అయితే నిరాహార దీక్ష కూడా చేస్తానని పేర్కొన్నారు.
ఉన్న భూమిని లాక్కునే యత్నం..
పేదలకు మూడెకరాలు ఇస్తానని చెప్పి, ఉన్న భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే ప్రజల మేలు కోసం ఒక్క పని కూడా చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పోడు పట్టాలు, రుణమాఫీ మాటలకే పరిమితం అయిందన్నారు. రైతుబంధు ఎకరాకు రూ.5వేలు ఇస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.
రూ.5 వేల పేరు చెప్పి
ఎకరాకు రూ.5వేలు ఇస్తూ రూ.25వేల విలువైన పథకాలను కేసీఆర్ బంద్ పెట్టిండన్నారు. ఎరువుల మీద సబ్సిడీ, పంట నష్టపోతే పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ, రాయితీపై విత్తనాలు, యంత్ర లక్ష్మి వంటి పథకాలను కేసీఆర్ అటకెక్కించారని ఆమె విమర్శించారు. ఇంట్లో ఇద్దరు అర్హులుంటే ఒక్కరికే పెన్షన్ ఇచ్చి, మరొకరికి అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా ఓట్ల కోసమేనని, ఎన్నికలు వస్తేనే కేసీఆర్ బయటకు వస్తాడని విమర్శించారు. కేసీఆర్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.