రైలు ఢీకొని పెద్దపులి మృత్యువాత-నల్లమల నుంచి బయటికొచ్చి-అనుమానాస్పద స్ధితిలో
అసలే దేశంలో పెద్దపులుల సంఖ్య భారీగా తగ్గిపోతోందని జంతు ప్రేమికులు బాధపడుతున్న తరుణంలో ఇవాళ మరో ఘోరం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి ప్రమాదంలో గాయపడి ప్రాణాలు వదిలిన ఘటన కలకలం రేపుతోంది.
నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోకి వచ్చే నంద్యాల-గిద్దలూరు రైల్వే ట్రాక్ పై ఇవాళ తెల్లవారు జామున ఓ పెద్దపులి కనిపించింది. దీంతో భయభ్రాయంతులైన స్ధానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పరిశీలించగా... అప్పటికే అది చనిపోయినట్లు నిర్ధారించారు. చుట్టు పక్కల లభించిన ఆధారాలను బట్టి చూస్తే అది రైలు ప్రమాదం కారణంగా చనిపోయినట్లు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ పెద్దపులి అటవీ ప్రాంతం వదిలి రైలు పట్టాలపైకి ఎందుకు వచ్చింది, ఇందులో వేటగాళ్ల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఉన్న చలమ మొదటి టన్నల్ వద్ద 233/9 మైలు రాయివద్ద గుడ్స్ రైలు ఢీకొన్న సంఘటన లో పెద్దపులి మృతి చెందినట్లు ప్రాధమికంగా అధికారులు నిర్ధారించారు. సంఘట స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు.. లభ్యమైన ఆధారాలను దర్యాప్తు కోసం తీసుకెళ్లారు. పెద్ద పులి రైలు ప్రమాదం తో చనిపోయిందా ..లేక మరే ఇతర కారణాలతో చనిపోయిందా అన్న విషయాలపై వారు అరా తీస్తున్నారు. వాస్తవానికి నల్లమల నుంచి ఈ రైలు మార్గంలో పులుల రాక తక్కువే ఉంటుంది. దీంతో ఎవరైనా ఈ పులిని చంపి రైలు పట్టాలపై పారేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.
నంద్యాల గిద్దలూరు రైలు మార్గంలో రైలు ఢీకొని పెద్ద పులి మృతి...#nandyala #tiger #trainaccident #oneindiatelugu pic.twitter.com/vLb7R7Ttsd
— oneindiatelugu (@oneindiatelugu) November 12, 2021