లాక్డౌన్తో వెలుగుచూసిన 200 ఏళ్లనాటి శివాలయం: యువత కృషి ఫలితమే
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల అనేక పనులు మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఓ పని పూర్తి చేశారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యువకులు. వీరి కృషితో ఇసుక మేటల్లో కూరుకుపోయిన 200 ఏళ్ల క్రితం నాటి శివుడి దేవాయలం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
Recommended Video

ఇసుక మేటల్లో కూరుకుపోయిన ఆలయం..
వివరాల్లోకి వెళితే.. చేజర్ల మండలం పెరుమాళ్లపాడు సమీపంలో పెన్నా నది గట్టున ఒక పురాతన ఆలయం ఉండేదని ఆ పరిసర ప్రాంతాల పెద్దలకు తెలుసు. అయితే, ఆ ఆలయం ఇసుక మేటల్లో కూరుకుపోవడంతో ఎక్కడుందో ఏర్పడని పరిస్థితి ఏర్పడింది. అయితే, యువకులు, పెద్దలందరూ కలిసి ఆలయాన్ని బయటికి తీసేందుకు కంకణం కట్టుకున్నారు.

ఇసుక మేటల కింద శివాలయం..
చివరకు ఆలయాన్ని గుర్తించి బయటికి తీసే పనులు మొదలుపెట్టారు. లాక్ డౌన్ కారణంగా పెద్దలు, యువకులు గ్రామాల్లోనే ఉండటంతో ఎక్కువ సమయం ఆలయాన్ని వెలికితేసేందుకు వెచ్చించారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మంగళవారం జేసీబీ యంత్రాలతో ఇసుకను తవ్వించారు. వారు ఊహించినట్లుగానే ఇసుక మేటల కింద శివాలయం కనిపించింది. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

పరశురాముడు ప్రతిష్టించిన శివలింగం..
ఈ దేవాలయంలో మహా విష్ణువు అవతారమైన పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడని ఇక్కడ చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు ఎంతో వైభవంగా వేడుకలు జరిగిన దేవాలయానికి పునర్ వైభవం తెచ్చేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఆలయాభివృద్ధి..
కాగా, ఈ ఆలయం 1850లో వచ్చిన వరదలకు నదిలో మునిగిపోయిందని ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామసుబ్బారెడ్డి వెల్లడించారు. . కాగా, స్థానికుల కోరిక ప్రకారం ఈ ఆలయాన్ని పునరుద్దరిస్తామని, ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రారెడ్డి తెలిపారు.
ఇదిఇలావుంటే, ఇటీవల ఒడిశాలోని మహానదిలో వేలఏళ్ల క్రితం నాటి గోపీనాథ ఆలయం బయటపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications