Omicron భయం: నెల్లూరులో ఓకే కుటుంబంలో నలుగురికి వైరస్
ఒమిక్రాన్ అంటేనే భయం.. దడ.. ఇప్పటివరకు ఈ వేరియంట్ తెలుగు రాష్రాల్లో లేదు. కానీ అనుమానాలు, లక్షణాలతో భయాందోళన మాత్రం నెలకొంది. ఏపీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే బాధితులు అమెరికా నుంచి కావలికి వచ్చారు. బాధితుల్లో ఇద్దరు ప్రముఖ వైద్యులు ఉన్నారు. బాధితుల ఆస్పత్రిలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో రెండు రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు వస్తాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా భారత్లో మరో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో రెండు, మహారాష్ట్రలో ఏడు కొత్త వేరియంట్ కేసును గుర్తించారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. గుజరాత్ జామ్ నగర్లో మరో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటీవలే జింబాబ్వే నుంచి భారత్ కు వచ్చిన ఎన్ ఆర్ఐలో ఒమిక్రాన్ వెలుగుచూసింది. ఇప్పుడు అతని భార్య, బావమరిదికి కూడా కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు జామ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.
మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. టాంజానియా నుంచి ముంబైలోని ధారావికి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 4న అతడు టాంజానియా నుంచి వచ్చాడు. ప్రస్తుతం అతడు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.
మరోవైపు దేశంలో ఇప్పటికీ చాలా మంది మాస్క్ ధరించడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం అని వివరించారు. వ్యాక్సిన్ తీసుకోవడం.. మాస్క్ ధరించడం రెండు ముఖ్యమేనని చెప్పారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో అయినా మనందరం జాగ్రత్తగా ఉండాలని కోరారు. చిన్నారులకు వ్యాక్సిన్ గురించి ఇప్పటివరకు సమాచారం తెలియరాలేదు. ఇప్పటివరకు దేశంలో 131 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. యువతకు దాదాపుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. నిన్నటి వరకు 74.5 కోట్ల మంది యువతకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. కేరళలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి.