రేయ్ లోకిగా: నువ్వు, నీ అబ్బ నిజంగా రాయలసీమలో పుట్టివుంటే..: మంత్రి అనిల్ కుమార్ ఫైర్
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొమ్మినేని పట్టాభిరామ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించిన అనంతరం నెలకొన్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఒకవంక.. టీడీపీ నాయకులు పిలుపునిచ్చిన ఆందోళనలు, రాష్ట్ర బంద్ మరోవంక ఉద్రిక్తతలకు దారి తీశాయి.

విమర్శల వేడి..
ఈ రెండు పార్టీల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం చోటు చేసుకుంటోంది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. వ్యక్తిగత దూషణలకు దారి తీస్తున్నాయి. దీనితో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్సార్సీపీ నాయకుల నిరసన ప్రదర్శనల సందర్భంగా పట్టాభిరామ్ నివాసం ధ్వంసమైందని, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని టీడీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.

నిజంగా దమ్ముంటే..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టయింది. పోలీసుల రక్షణ లేకపోతే.. వైసీపీ నాయకులు, కార్యకర్తల రెక్కలు విరిచి, రాష్ట్రం నుంచి తరిమి కొడతామంటూ నారా లోకేష్ సవాల్ విసిరారని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నారా లోకేష్కు నిజంగా దమ్ముంటే.. తాను చేసిన సవాల్కు కట్టుబడి ఉండాలని, తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం కావాలని చెప్పారు.

వైసీపీ కార్యకర్తను టచ్ చేసే ధైర్యం ఉందా?
నారా లోకేష్ ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో కూర్చుని ఎదవ డైలాగులు చేస్తున్నాడని, మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. పగిలిపోతుందని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. తన సవాల్ను స్వీకరించే దమ్ము ఉంటే నారా లోకేష్ ముందుకు రావాలని అన్నారు. వారం రోజులపాటు తాను ఇక్కడే ఉంటానని, ఎవడు అడ్డు వస్తాడో రావాలని, ఎవడు తన కార్యకర్తల మీద చెయ్యి వేస్తాడో రావాలని ఆయన సవాల్ విసిరారు. వైసీపీ కార్యకర్తను టచ్ చేసే ధైర్యం చేయాలని అన్నారు.

రాష్ట్రం విడిచి పారిపోయింది బాబు, అతని కొడుకే..
తమ పార్టీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడే వారి చర్మం వలిచేస్తామని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రిని దూషించడం నారా లోకేష్ లేకితనానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటిదాకా తాము గౌరవంతో ఉన్నామని, తమ సహనాన్ని పరీక్షించొద్దని చెప్పారు. ఎల్లో మీడియా పేపర్లు, టీవీల్లో కామెంట్లు చేయడం కాదని, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రమ్మని అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే దమ్ము టీడీపీ లేదని, నిజానికి చంద్రబాబు, నారా లోకేష్ రాష్ట్రం వదిలి పారిపోయారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.

పక్క రాష్ట్రంలో తలదాచుకుంటూ
చంద్రబాబు, నారా లోకేష్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చీపోతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే హైదరాబాద్కు పారిపోయారని, అక్కడ బంగళా కట్టుకుని తలదాచుకుంటున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దమ్ము ఉంటే ఏపీలోనే ఉండాలని ఆయన సవాల్ విసిరారు. వారిద్దరికీ రాష్ట్రంలో ఉండే దమ్ము, ధైర్యం లేదని చెప్పారు. ట్విట్టర్లో కూర్చుని చిలకపలుకులు మాట్లాడటం కాదని అన్నారు.

సీమ పౌరుషమే ఉంటే..
నారా లోకేష్ నిజంగా రాయలసీమలో పుట్టివుంటే వైసీపీ కార్యకర్తల మీద చెయ్యి వేయాలని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు రాయలసీమలో పుట్టివుంటే తమ పార్టీ కార్యకర్తలను టచ్ చేసే ధైర్యం చేయాలని చెప్పారు. ఎవడు ఎవడి రెక్కలు విరగ్గొడుతాడో.. ఎవరు ఈ రాష్ట్రం వదిలి పోతాడో తేల్చుకుందామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. అధికారం పోయిందనే అక్కసుతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రగిలిపోతున్నారని చెప్పారు.

నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి..
నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ బలిజపాలెంలో 23 లక్షల రూపాయలతో నిర్మించనున్న పార్కుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ శంకుస్థాపన చేశారు. అనంతరం యలమవారిదిన్నె, బలిజపాలెం, మిట్టపాలెం ప్రాంతాలలో 1.70 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటింటికి మంచి నీటి కుళాయిలను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications