ప్రజలకు ఆనందయ్య కీలక విజ్ఞప్తి-ఇప్పుడే ఎవరూ కృష్ణపట్నం రావొద్దని-ఆయన్ను చూపించాలంటున్న జనం
కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్ పడి వారం రోజులు దాటిపోయింది. పరిశోధనలు పూర్తయి నివేదిక వస్తే తప్ప ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. వారం రోజుల్లో ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఏఎస్)కు తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల నివేదిక అందించవచ్చునని రెండు రోజుల క్రితం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం(మే 27) హైకోర్టులో ప్రభుత్వ తరుపు న్యాయవాది.. ఈ నెల 29న ఆయుష్ నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వస్తుందన్నారు. మరోవైపు జనం మాత్రం మందు కోసం కృష్ణపట్నం వెళ్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నాటు వైద్యుడు ఆనందయ్య ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.

ఇప్పుడే ఎవరూ రావొద్దన్న ఆనందయ్య
కరోనా నివారణకు తాను తయారుచేసిన ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య తెలిపారు. శుక్రవారం(మే 28) నుంచి మందు పంపిణీ ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. దయచేసి ప్రజలు అలాంటి వదంతులు నమ్మవద్దని... ఇప్పుడే ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఔషధ తయారీకి కావాల్సిన ముడి సరుకు కూడా ప్రస్తుతం తమ వద్ద లేదన్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారుచేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఆనందయ్య ఎక్కడ అంటున్న జనం...
ప్రస్తుతం ఆనందయ్య పోలీస్ భద్రత నడుమ రహస్య ప్రాంతంలో ఉన్నారన్న కథనాలు వస్తున్నాయి. ఆనందయ్య ఆచూకీ చెప్పాలని.. ఆయన్ను చూపించాలని కృష్ణపట్నం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆనందయ్యను ప్రజల ముందుకు ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఆనందయ్యను నిర్బంధించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తాను తయారుచేసిన నాటు మందు ఫార్ములా చెప్పాలని అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

హైకోర్టులో పిటిషన్...
తాను తయారుచేసిన కరోనా మందు పంపిణీకి సంబంధించి ప్రభుత్వ జోక్యం లేకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆనందయ్య కోరారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా తాను ఉచితంగా మందు పంపిణీ చేసేందుకు తగినంత రక్షణ కల్పించాలని కోరారు. మందు పంపిణీకి తక్షణం అనుమతినిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. మరోవైపు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ... ఈ నెల 29న ఆయుష్ శాఖ నుంచి నివేదిక వచ్చాక ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత ఆనందయ్య మందును ప్రజలకు ఇవ్వొచ్చా లేదా అనుమతినిచ్చే అధికారం ఎవరికి ఉందన్న వివరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని కోర్టు సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఈ నెల 31కి విచారణ వాయిదా వేసింది.
Recommended Video
నివేదిక వచ్చాకే నిర్ణయం
ఆనందయ్య మందుపై రాష్ట్ర ఆయుష్ శాఖ,ఐసీఎంఆర్ ఇప్పటికే అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. ఆయుష్ కమిషనర్ రాములు దీన్ని నాటు మందుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఆయుర్వేద ప్రోటోకాల్స్ పాటించనందునా నాటు మందుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఈ మందులో ఎటువంటి హానికారక పదార్థాలు లేవని... ఇప్పటివరకూ మందు తీసుకున్నవారిలోనూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడలేదని చెప్పారు. ఇక ఈ మందుకు సంబంధించి ఐసీఎంఆర్ నివేదిక ఇంకా అందలేదు. ప్రస్తుతం తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీ ఈ మందుపై అధ్యయనం చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి అధ్యయనం తర్వాత నివేదికను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఏఎస్)కు అందించనున్నారు. అక్కడినుంచి నివేదిక ప్రభుత్వానికి చేరనుంది. నివేదికను పరిశీలించాక ప్రభుత్వం మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటుంది.












Click it and Unblock the Notifications