ఇస్రో సరికొత్త అధ్యాయం - నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్..!!
నెల్లూరు: దేశీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ఇవ్వాళ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి సన్నాహాలను పూర్తి చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి దీన్ని నింగిలోకి పంపించబోతోంది. ఈ తరహా ప్రయోగం చేయబోతోండటం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. అంతరిక్షంపైన కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి సంకేతాలు ఇచ్చినట్టవుతోంది.
హైదరాబాదీ కంపెనీ..
ఈ రాకెట్ను స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించింది. హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ ఇది. ఈ ఉదయం 11:30 గంటలకు విక్రమ్- సబార్బిటల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. విక్రమ్- ఎస్ అని క్లుప్తంగా పిలుచుకోవచ్చు. దేశీయ అంతరిక్ష పరిశోధనలకు పితామహుడిగా భావించే డాక్టర్ విక్రమ్ సారాభాయ్కి నివాళిగా ఈ రాకెట్కు 'విక్రమ్-ఎస్' అని పేరుపెట్టారు. అలాగే- ఇదే తొలి ప్రైవేట్ రాకెట్ కావడం వల్ల ఈ మిషన్కు ప్రారంభ్ మిషన్గా నామకరణం చేశారు.
మూడు పేలోడ్స్..
ఈ ప్రైవేట్ రాకెట్ పొడవు ఆరు మీటర్లు. బరువు 545 కిలోలు. నింగిలోకి సుమారు 81 కిలోమీటర్ల మేర ఎత్తుకు దూసుకెళ్లనుంది. తన వెంట మూడు పేలోడ్లను మోసుకెళ్లబోతోంది. వాటిని ఆర్బిట్లో ప్రవేశపెడెతుంది. అవన్నీ ఉపగ్రహాలే. ఇందులో ఒకటి స్వదేశీ ఉపగ్రహం కాగా.. మిగిలిన రెండూ విదేశాలకు చెందినవి. ఈ స్వదేశీ ఉపగ్రహాన్ని చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ స్పేస్ కిడ్స్ రూపొందించింది. దీని పేరు ఫన్-శాట్. రెండున్నర కిలోల బరువు ఉన్న చిన్న శాటిలైట్ ఇది.
మరిన్ని కాంట్రాక్ట్స్
ఇది ప్రారంభం మాత్రమే. దీని తరువాత కూడా అనేక ప్రైవేటు ప్రాజెక్టులను చేపట్టనుంది ఇస్రో. అంతరిక్ష రంగంలో పరిశోధనలకు సంబంధించిన రంగంలో కార్యకలాపాలను సాగిస్తోన్న పలు స్టార్టప్ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి సిద్ధమౌతోంది. బెంగళూరులో నిర్వహించిన టెక్ సమ్మిట్ 2022లో భాగంగా ఇస్రో ఈ ప్రకటన చేసింది. ఆర్ అండ్ డీ ఆఫ్ ఇండియా - ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్' అనే అంశంపై నిర్వహించిన ఈ సమ్మిట్కు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ హాజరయ్యారు.

త్వరలో చంద్రాయన్ 3
వందకు పైగా స్టార్టప్ కంపెనీలు తమ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని, అవన్నీ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించినవేనని చెప్పారు. దీనితో పాటు భారత్.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ మిషన్ తాజా పరిస్థితినీ ఆయన వివరించారు. త్వరలోనే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ను చేపట్టనున్నట్లు చెప్పారు. మానవ సహిత రాకెట్ను చంద్రుడిపై ప్రయోగించడానికి సన్నద్ధమౌతోన్నామని పేర్కొన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications