నెల్లూరులో స్టీల్ ప్లాంట్ .. జిందాల్ సంస్థకు భూమిని కేటాయిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం ఇస్తుంది. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే వారికి రెడ్ కార్పెట్ పరుస్తుంది ఏపీ సర్కార్ . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తమ్మినపట్నం మోమిడి పరిధిలో గతంలో కిన్నెటా పవర్ కు ఇచ్చిన భూములను రద్దుచేసి వాటిని జిందాల్ సంస్థకు కేటాయించింది . జిందాల్ సంస్థకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం 860 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిలో 7,500 కోట్ల రూపాయలతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ సంస్థ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. జిందాల్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 2500 మందికి పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్ విస్తరణకు వచ్చే నాలుగేళ్లలో మూడు వేల ఎకరాలు అవసరమవుతుందని జిందాల్ సంస్థ అంచనా వేస్తోంది.
ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని అడుగు ముందుకు వేస్తూ ఉంటే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను విరమించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే, మరోపక్క ఏపీ సర్కార్ ప్రైవేటు రంగ సంస్థ జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తమ వంతు సహకారాన్ని అందిస్తోంది.