వైఎస్ జగన్ ప్లాన్ సక్సెస్: ఆక్సిజన్ ప్లాంట్లలో వైజాగ్ నౌకాదళ నిపుణుల రిపేర్లు: రీఓపెన్
నెల్లూరు: రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుపతిలోని ప్రఖ్యాత రామ్నారాయణ్ రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది పేషెంట్లు మరణించిన విషాదకర ఘటన అనంతరం.. ఆయన యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం చేతికి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది.
నెల్లూరు, శ్రీకాళహస్తిల్లో రెండు ప్లాంట్ల పునరుద్ధరణ..
సాంకేతిక, యాంత్రిక లోపాలు తలెత్తడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రెండు ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్లు నిరుపయోగంగా ఉంటోన్నాయి. ఒకటి కాదు..రెండు కాదు.. ఆరు సంవత్సరాలుగా ఆ ఆక్సిజన్ ప్లాంట్లు మూతపడి ఉంటున్నాయి. ఇదివరకు ఈ రెండు ప్లాంట్లు పెద్ద ఎత్తున ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుండేవి. నెల్లూరులోని ప్లాంట్..ఒక రోజులో 400 జంబో టైపు సిలిండర్లను ఫిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. శ్రీకాళహస్తిలోని మరో ప్లాంట్ నిమిషానికి 16,000 లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్త చేస్తుంది. వీపీఎస్ఏ టెక్నాలజీతో పనిచేసే ప్లాంట్ అది.
వారం రోజుల పాటు మరమ్మతులు
సుదీర్థకాలం పాటు మూతపడి ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విషయాన్ని విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ నిపుణులకు తెలియజేసింది. మరమ్మతులు చేసి, వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. దీనితో నావల్ డాక్యార్డ్ నిపుణులు రంగంలోకి దిగారు. వారంరోజుల పాటు వాటికి మరమ్మతు చేశారు. ఈ రెండు ప్లాంట్లలో సాంకేతిక లోపాలకు గురైన పరికరాలు, యంత్రాలు, ఇతర సామాగ్రికి మరమ్మతు నిర్వహించారు. ఈ రెండింటినీ వారు పునరుద్ధరించారు. దీనికోసం ప్రత్యేకంగా విశాఖ నావల్ డాక్యార్డ్ నుంచి పరికరాలను తెప్పించారు.
ట్రయల్ రన్ సక్సెస్..
రిపేర్లు పూర్తయిన తరువాత ట్రయల్ నిర్వహించారు. అది విజయవంతమైంది. నెల్లూరు ప్లాంట్లో క్రయోజనిక్ టెంపరేచర్ మైనస్ 186 డిగ్రీల సెల్సియస్ వద్ద ట్రయల్ నిర్వహించారు. ఆక్సిజన్ అవుట్పుట్ సాధించారు. శ్రీకాళహస్తి ప్లాంట్లో 93 శాతానికి పైగా నాణ్యత గల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ను ఉత్పత్తిని పునరుద్ధరించారు. ఇందులో కార్బన్ మొనాక్సైడ్ శాతం జీరోగా తేలింది. కార్బన్ డయాక్సైడ్ శాతం 0.02 శాతంగా నిర్ధారితమైంది. 93 శాతానికి పైగా నాణ్యమైన మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఉత్పత్తిని పునరుద్ధరించినట్లు నావల్ డాక్యార్డ్ తెలిపింది.
ఇదివరకు రూయాలో..
ఇదివరకు తిరుపతి రామ్నారాయణ్ రూయా ఆసుపత్రిలో వైజాగ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులు ఆక్సిజన్ ప్లాంట్కు మరమ్మతులు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళం అధికారుల చేతికి అప్పగించారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులు ఇక మీదట ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను చూసుకుంటారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ వాటి పర్యవేక్షణ నౌకాదళాధికారుల చేతిలోనే ఉంటుంది.