అడకత్తెరలో నిజామాబాద్ ఎంపీ అరవింద్.. పసుపు బోర్డుపై సొంత పార్టీ నేతలకు కేంద్రం షాక్
తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తాను అన్న ప్రధాన హామీతో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు పసుపు రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఏపీలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అమ్మి తీరతామని తేల్చి చెప్పి ఏపీ బీజేపీ నేతలకు ఇబ్బందులు సృష్టించారు . గతంలోనూ ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీ తప్పి ఏపీ ప్రజల్లో పట్టు కోల్పోయారు . అధిష్టాన నిర్ణయాలతో తెలంగాణా , ఏపీ బీజేపీ నాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయి .

పసుపు బోర్డు హామీతో ఎంపీ అయిన ధర్మపురి అరవింద్
గత పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల సమయంలో పసుపు రైతుల ఆందోళన ఉధృతంగా సాగింది. ఉద్యమ బాట పట్టిన నిజామాబాద్ పసుపు రైతులు పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో పోటీకి సైతం దిగారు. దేశవ్యాప్తంగా నిజామాబాద్ పసుపు రైతుల ఉద్యమం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కచ్చితంగా పసుపు బోర్డును తీసుకువచ్చి తీరుతానని, తనకు ఓటు వేసి గెలిపించాలని ధర్మపురి అరవింద్ చేసిన విజ్ఞప్తి మేరకు, నమ్మిన ప్రజలు ఓటేశారు. రైతులు పసుపు బోర్డు ను అరవింద్ ఖచ్చితంగా తీసుకొస్తారని నమ్మారు. తనను గెలిపిస్తే పసుపు బోర్డు కచ్చితంగా తీసుకు వస్తానని ఏకంగా ఓటర్లకు బాండు రాసిచ్చిన అరవింద్, ఇప్పుడు ఆ బాండ్ పై సమాధానం చెప్పాల్సి ఉంది.

పసుపు బోర్డు తీసుకురాలేకుంటే రాజీనామా చేస్తానని సవాల్ .. ఇప్పుడు అరవింద్ రాజీనామాకు డిమాండ్
ఇక నాడు ప్రచారానికి వచ్చిన బీజేపీ నేతలు సైతం ఇదే హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఇప్పటివరకు పసుపు బోర్డు సంగతి ఊసేలేదు. మధ్యలో మున్సిపల్ ఎన్నికల సమయంలో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను కేంద్రం నియమించిందని ప్రజలను నమ్మించే యత్నం చేశారు . తాను పసుపు బోర్డు తీసుకురాలేకపోతే రాజీనామా చేస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అప్పుడు సవాల్ చేశారు. ఇప్పుడు ఆ సవాల్ ఆయనకు పెద్ద చిరాకు తెచ్చిపెట్టింది. పసుపు బోర్డు విషయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిన అరవింద్ ఇప్పుడు రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.
జీవన్ రెడ్డి , బాల్క సుమన్ అరవింద్ ను టార్గెట్ చేసి పసుపు బోర్డుపై ప్రశ్నిస్తున్నారు .

పసుపు రైతులకు అరవింద్ ఏమని సమాధానం చెప్తాడో ?
ఇక ఇదే సమయంలో తెలంగాణ అధికార పార్టీ నేతలు సైతం ధర్మపురి అరవింద్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ప్రజలు అరవింద్ ను తరిమికొట్టే రోజులు వచ్చాయని అంటున్నారు. పసుపు రైతులకు ధర్మపురి అరవింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పసుపు బోర్డు దుమారం ఎంపీ ధర్మపురి అరవింద్ మెడకు చుట్టుకుంది. దీనిపై కేంద్ర మంత్రుల ప్రతిపాదన లేదని తేల్చి చెప్పడంతో, పసుపు రైతులకు అరవింద్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications