కాంగ్రెస్ నినాదాల పార్టీ.. బీజేపీ చేసిందేమీ లేదు : కవిత
నిజామాబాద్ : దేశాన్ని సంవత్సరాలకొద్దీ పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు ఎంపీ కవిత. ఎన్నో ఏళ్లుగా అధికార పీఠంపై కూర్చుని పేదరికం నిర్మూలించకపోవడం దారుణమన్నారు. అభివృద్దిపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని.. అది కేవలం నినాదాలకు మాత్రమే పరిమితమని వ్యాఖ్యానించారు.
అన్న దారిలో చెల్లెమ్మ..! ఏపీ హోదా కోసం రాములమ్మ న్యూ ఫార్ములా
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నవీపేట మండలం పోతంగల్ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కవిత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
I casted my vote in the local election for the position of Sarpanch at Village Pothangal. Is crucial for the prosperity of the country and everyone to actively participate in their village and local government elections. pic.twitter.com/baoqiRdAjc
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 30, 2019
తెలంగాణ గ్రామాలను ముందెన్నడూ లేని విధంగా అభివృద్ది చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పుకొచ్చారు కవిత. గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. పంచాయతీ ఎలక్షన్లలో 80 శాతం టీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సర్పంచులుగా ఎన్నికైనవారు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 చోట్ల గెలుస్తుందని జోస్యం చెప్పిన కవిత మరో స్థానం ఎంఐఎం దక్కించుకుంటుందని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెండింగ్ హామీలపై దృష్టి పెడతామన్నారు కవిత. సచివాలయం నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న డిఫెన్స్ స్థలం కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు. నకిలీ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్న గల్ఫ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుందని, దాన్ని అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.