నిజామాబాద్లో విషాదం : గోదావరిలో గల్లంతైన ఏడుగురు... ఇద్దరి మృతదేహాలు లభ్యం
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో ఏడుగురు గల్లంతయ్యారు. స్నానం కోసం నదిలో దిగిన ఏడుగురు ప్రమాదవశాత్తు గల్లంతైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు గల్లంతైనవారి కోసం గాలించగా ఒకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో నలుగురి కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. వీరంతా నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Recommended Video
గురువారం(ఏప్రిల్ 1) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే తరహా విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. . పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు గోదావరి నది వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మృతులను జమ్మి షణ్ముఖరావు (23),నిమ్మల హరిచంద్ (25)లుగా గుర్తించారు. నదిలో కుక్కకు స్నానం చేయిస్తున్న క్రమంలో అది లోతు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లింది. దీంతో దాన్ని కాపాడే ప్రయత్నంలో హరిచంద్, షణ్ముఖరావు అటువైపు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. ఇంకా ఆ ఇద్దరు యువకుల జాడ తెలియరాలేదు. యువకుల గల్లంతుతో వారు నివాసముండే బూర్గంపహాడ్ మండలం మోతే పట్టీనగర్లోని రిక్షా నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన యువకుల్లో హరిచంద్ ఐటీసీ పీఎస్ పీడీలో షిఫ్ట్ ఇన్చార్జీగా పనిచేస్తుండగా, షణ్ముఖరావు పాల్వంచలోని బీటెక్ పూర్తిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.