అర్ధనగ్నంగా ఆర్టీసీ డ్రైవర్.. అధికారుల ముందు అలా, ఎక్కడ, ఎందుకంటే..
పెద్ద వాహనాల్లో మైలేజీ కంపల్సరీ.. లాంగ్ వెహికిల్స్ అయినందున మైలేజీ తప్పనిసరి అవుతుంది. ఇక ఆర్టీసీ బస్సుల్లో ఇదీ తప్పదు. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. మైలేజీ తక్కువ రావడంతో మరింత భారం పడుతుంది. దీనికి సంబంధించి డ్రైవర్లకు నిత్యం కౌన్సెలింగ్ ఉంటుంది. అయితే ఓ డ్రైవర్ చిరాకుగా ఉన్నాడు. పాత బస్సులతో మైలేజీ ఎలా అని అడుగుతున్నాడు. కోపం కట్టలు తెంచుకోవడంతో తన బట్టలు తానే చించుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
నిజామాబాద్ ఆర్టీసీ డిపో-2లో డ్రైవర్ గణేశ్ గత పదిహేనేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల అతను నడుపిస్తోన్న బస్సు మైలేజీ తక్కువ వస్తోంది. దీంతో అధికారులు గణేశ్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారం కూడా గడవకముందే మరోసారి గణేశ్ను డీఐ పిలిచి మైలేజ్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మైలేజ్ తగ్గినందుకు డీఎంను కలవాలని సూచించారు.
డ్రైవర్ గణేశ్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారం గడవక ముందే కౌన్సిలింగ్ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాత బస్సులు ఇచ్చి మైలేజీ ఎక్కువ రావాలంటే ఎలా వస్తాయంటూ ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. ఇంతటితో ఆగకుండా తన ఒంటిపై ఉన్న బట్టలు విప్పి నిరసన వ్యక్తం చేశారు. గణేశ్ తీరుతో ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. తోటి ఉద్యోగులు గణేశ్ను వారించే ప్రయత్నం చేశారు.
విషయంపై డీఎం స్పందించారు. కౌన్సెలింగ్కు హాజరుకావాలనే బాధతో గణేశ్ అలా చేశాడని తెలిపారు. కానీ అతని తీరు డిపోలో చర్చకు దారితీసింది. వాస్తవానికి పాత బస్సుల్లో మైలేజీ రాదు. సర్వీసింగ్ చేసి.. నడిపించాలి. కానీ చేయి ఎత్తిన చోట బస్సు ఆపితే మైలేజీ ఎక్కడ వస్తుందని డ్రైవర్లు అంటున్నారు. అదే అంశం పేరుతో కౌన్సిలింగ్ ఇవ్వడంపై చిరాకుగా ఉన్నారు. డ్రైవర్ గణేశ్ కూడా అసహసనం వ్యక్తం చేశారు.