ఇదెక్కడి రాజ్యం.. 1500 కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ..!
బాల్కొండ : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏమైపోతోంది. మహాత్ముడు ఆశించిన గ్రామ స్వరాజ్యం రానట్లేనా? టెక్నాలజీని అందిపుచ్చుకుని గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించే తరుణంలో నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన దారుణం సభ్యసమాజానికి తలవంపులు తెచ్చేలా ఉంది. ఇంటర్నెట్ యుగంలోనూ మూస ధోరణిలో మునిగి తేలిపోయే కొందరు పెద్దలు అనుసరిస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరుతున్నాయి.
కేసీఆర్ అహంకారం తగ్గించుకో.. తెలంగాణ నీ రాజ్యం కాదు : కాంగ్రెస్
ఈ రోజుల్లో అలాంటి నిర్ణయమా?
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బాల్కొండ గ్రామాభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయం అభాసుపాలవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించడం హాట్ టాపికయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
బాల్కొండ గ్రామాభివృద్ధి కమిటీ అరాచకాలు పరాకాష్టకు చేరాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను సాకుగా తీసుకుని వివిధ కులాలకు చెందిన 1500 కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించడమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన ఇలాంటి రోజుల్లో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వీడీసీ వింత నిర్ణయం.. 300 పద్మశాలి కుటుంబాలు బలి
బాల్కొండకు చెందిన డాక్టర్ రాజు పద్మశాలి కులానికి చెందినవారు. అయితే ఆయనతో జరిగిన భూ తగాదాల నేపథ్యంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఆ ఘటనను పద్మశాలి కులంపై రుద్ది.. ఆ కులస్తులందరికీ సాంఘిక బహిష్కరణ విధించింది. బాల్కొండలో దాదాపు 300 పైగా పద్మశాలి కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికీ స్థానికులు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని హుకుం జారీ చేసింది వీడీసీ. నిత్యావసరాలు సహా ఎలాంటి వస్తువులు అమ్మొద్దని ఆదేశించింది. అంతటితో ఆగకుండా మున్నూరు కాపు కులస్తులకు చెందిన ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న పద్మశాలీలను ఖాళీ చేయించాల్సిందిగా ఇంటి యజమానులను రెచ్చగొడుతున్నట్లు సమాచారం.
ఖబ్రస్థాన్ జాగాపై కూడా వివాదం.. ముస్లిం కుటుంబాలు బలి
బాల్కొండకు చెందిన ముస్లింలు గతంలో ఠాణా మెట్లెక్కారు. ఖబ్రస్తాన్లో సమాధులను తొలగించిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై ఫిర్యాదు చేశారు. అయితే ఆ స్థలం తమదే కాబట్టి అలా చేశామని కమిటీ సభ్యులు వాదించారు. దాంతో ఆర్మూర్ డీఎస్పీ స్వయంగా వచ్చి ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆ స్థలానికి సంబంధించిన పట్టాలు కమిటీ సభ్యుల దగ్గర ఉండిపోవడంతో దానికి తగ్గ విలువను చెల్లిస్తామని ముస్లింలు హామీ ఇచ్చారు.
అదలావుంటే ఇటీవల ముస్లింలు పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలంటూ వారిపై గ్రామాభివృద్ధి కమిటీ వత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆ మేరకు ముస్లిం వర్గీయులపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అద్దె ఇళ్లల్లో ఉంటున్న ముస్లిం కుటుంబాలను ఖాళీ చేయించాలని తీర్మానం చేసినట్లు వినికిడి.
తస్మాత్ జాగ్రత్త.. అది టైమ్ పాస్ కాదట.. రోగమట..!
ఆర్టీఐ వేసినందుకు.. గౌడ కులస్థులపై కన్నెర్ర
బాల్కొండలోని గవర్నమెంట్ జాగాలో నిర్మిస్తున్న కట్టడాలపై గౌడ కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆర్టీఐ కింద వివరాలు సేకరించారు. తమకు చెప్పకుండా ఆర్టీఐ దరఖాస్తు ఎలా పెడతారని వారికి జరిమానా విధించారు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు. అయితే సదరు యువకులు ఫైన్ చెల్లించేది లేదంటూ మొండికేశారు.
దాంతో పంచాయితీ టైపులో పలు దఫాలుగా సిట్టింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే దానికి 3 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని.. ఆ మొత్తం గౌడ కులస్థులు చెల్లించాలని డిమాండ్ చేశారు కమిటీ సభ్యులు. దానికి వారు నో చెప్పడంతో కక్షగట్టి గౌడ కులస్థులకు కూడా సాంఘిక బహిష్కరణ విధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 1500 కుటుంబాల వరకు సాంఘిక బహిష్కరణ విధించడంతో స్థానికుల నుంచి సహాయ సహకారాలు అందక వారు నానా తిప్పలు పడుతున్నట్లు సమాచారం.