బంగారు దుకాణాలే టార్గెట్.. నిజామాబాద్లో రెచ్చిపోయిన దొంగలు.. వరుసగా మూడు షాపుల్లో చోరీ
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. బంగారు దుకాణాలే టార్గెట్గా అందినకాడికి దోచుకెళ్లారు. వరుసగా మూడు జ్యువెల్లరీ షాపుల్లో చోరీలు చేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఒక్క దొంగతనం చేయాలంటేనే.. రెక్కీలు గట్రా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే దొంగలు ఏకంగా మూడు దుకాణాల్లో చోరీలు చేయడం చర్చానీయాంశమైంది.
నిజామాబాద్లో అర్ధరాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వినాయక్ నగర్ ప్రాంతంలో ఉన్న మూడు నగల షాపుల్లో చోరీలు చేశారు. షెట్టర్లు తొలగించి దుకాణాల్లోని నగలను దోచుకెళ్లారు. అయితే వరుసగా మూడు జ్యువెల్లరీ షాపుల్లో దొంగతనం జరగడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
ఏకకాలంలో మూడు నగల షాపులపై దొంగలు విరుచుకుపడటం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.

వినాయక్ నగర్ ఏరియాలోని సాయితేజ, చరణ్ తేజ, శ్రీ సాయి మహాలక్ష్మి నగల షాపులపై దొంగలు విరుచుకుపడ్డారు. ఈ మూడు దుకాణాల్లో అందినకాడికి దోచుకెళ్లారు. నగలతో పాటు నగదు కూడా చోరీకి గురైంది. అర్ధరాత్రి దాటాక 2 నుంచి 3 గంటల సమయంలో ఈ చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే చోరీలు చేసేటప్పుడు దొంగలు జాగ్రత్తపడ్డారు. ముందుగా సీసీ కెమెరాలకు సంబంధించిన కేబుల్స్ కట్ చేశారు. అయితే ఓ షాపులో మాత్రం చోరీ చేస్తుండగా ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.
వరుస దొంగతనాలతో నిజామాబాద్ ఉలిక్కిపడింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మూడు షాపుల్లో చోరీలు చేసింది ఒకే ముఠాకు చెందినవారుగా అనుమానిస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications