కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?
నిజామాబాద్ : పక్కా స్కెచ్ వేస్తారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం.. తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడు అనుకూలంగా మలుచుకుంటారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరు. లోక్సభ ఎన్నికల సమయాన కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన రాజకీయ చతురతకు అద్దం పడుతోంది. ఎక్కడ నెగ్గాలో, ఎవరిని ముగ్గులోకి దించాలో ఆయనకు బాగా తెలుసు.
అందుకే సరైన సమయానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన కీ లీడర్ ను కారెక్కించారు. టీడీపీ సీనియర్ మండవ వెంకటేశ్వరరావు ఇంటికి కేసీఆర్ స్వయంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజామాబాద్ లోక్సభ బరిలో కూతురు విజయం కోసం ఆయన వేసిన పాచిక పారి మండవకు గులాబీ తీర్థం పోయడం పెద్ద స్కెచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ కవితదే : మండవ
సైకిల్ దిగి కారెక్కిన మండవ వెంకటేశ్వర రావు టీఆర్ఎస్ పార్టీకి తనదైన సేవలందిస్తున్నారు. గులాబీ వనంలో చేరిచేరగానే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నిజామాబాద్ లోక్సభ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కల్వకుంట్ల కవితకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కవిత గెలుపు ఖాయమని.. ఆమె విజయం కోసం అహర్నిశలు పనిచేస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని.. మిత్రుడు కేసీఆర్ ఆహ్వానం మేరకు గులాబీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 16 పార్లమెంటరీ స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ఘంటాపథంగా చెప్పారు. తాను మాత్రం పదవులు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు.

డైనమిక్ లీడర్ గా గుర్తింపు
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మండవ వెంకటేశ్వర రావు తనదైన ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ నేతగా ఇన్నాళ్లు చక్రం తిప్పారు. డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారనే చెప్పొచ్చు. జిల్లా అధ్యక్ష పదవిని తిరస్కరించడమే గాకుండా.. పార్టీ కార్యాలయానికి కూడా పెద్దగా వెళ్లిన దాఖలాలు లేవు. 2018 ఎన్నికల్లో మహాకూటమి పొత్తుల్లో భాగంగా డిచ్పల్లి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించడంతో.. ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు.

ఆనాటి దోస్తీ.. ఇన్నాళ్లు ఏమైంది?
ఉమ్మడి రాష్ట్రాన చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్, మండవ సహచరులుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహముంది.
అయితే రాజకీయ వైరుధ్యం నేపథ్యంలో ఇద్దరు వేరయ్యారు. అప్పటినుంచి పెద్దగా కలుసుకున్న సందర్భాలు లేవు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మండవ కారెక్కుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన మాత్రం పెదవి విప్పలేదు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దరిమిలా ఎంతోమంది ఇతర పార్టీల నేతలను కారెక్కించిన కేసీఆర్.. మండవ వెంకటేశ్వర రావును టీఆర్ఎస్ లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు. టీడీపీలో ఉన్న తన సహచరులను ఎంతోమందిని గులాబీ వనానికి రప్పించగల్గిన కేసీఆర్.. మండవను విస్మరించారా? లేదంటే ఆయనతో అవసరం లేదనుకున్నారా? కాదంటే మండవనే తిరస్కరించి ఉంటారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకవేమో.

కూతురు గెలవాలిగా?
నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పసుపు, జొన్న రైతులు మద్దతు ధర ప్రకటించడం లేదంటూ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. సిట్టింగ్ ఎంపీ కవితను వ్యతిరేకిస్తూ 178 మంది రైతులు నామినేషన్లు వేశారు. అయితే వీరి నామినేషన్లను మొదట టీఆర్ఎస్ శ్రేణులు లైట్ గా తీసుకున్నప్పటికీ.. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ టెన్షన్ పడుతున్నారనే టాక్ నడుస్తోంది. అటు కేసీఆర్ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇన్నాళ్లు మండవ అవసరాన్ని పెద్దగా గుర్తించని కేసీఆర్.. ఇప్పుడు కూతురు కవిత గెలుపుకోసం ఆరాటపడుతూ ఆయన్ని అత్యవసరంగా కారెక్కించారనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే అనూహ్యంగా మండవ ఇంటి గడప తొక్కారేమో కేసీఆర్.












Click it and Unblock the Notifications