స్క్రాపింగ్ పాలసీ అమలైతే ఆ వాహన యజమానులకు చుక్కలే..!
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ పై చాలా మంది దృష్టి సారించారు. ఒకవేళ అది అమల్లోకి వస్తే ఒక వాహనం కొనుగోలు చేసి 15 ఏళ్లు దాటినట్లయితే మరోసారి దాన్ని సెకండ్ హ్యాండ్ కింద కొనాలంటే ఖరీదు ఎక్కువగానే అవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆ వాహనం కమర్షియల్ వెహికల్ కేటగిరీలోకి వస్తే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందేందుకు అయ్యే ఖర్చు దాదాపు 62 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించాలంటే 8 రెట్లు ఎక్కువగా ఖర్చు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ టాక్స్ కూడా విధిస్తాయి. ఇది రోడ్ టాక్స్కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
మరో రెండు వారాల్లో రహదారుల మరియు రవాణా మంత్రిత్వ శాఖ స్క్రాపింగ్ పాలసీని ప్రకటించనుంది. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ప్రస్తుతం 8 ఏళ్లు దాటిన వాహనంకు ప్రతి ఏటా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి. అంతేకాదు దీనిపై గ్రీన్ టాక్స్ను రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇది సాధారణంగా చెల్లించే రోడ్ టాక్స్కు అదనంగా 10శాతం నుంచి 25 శాతం ఉంటుంది. ప్రస్తుతం నిబంధనలు ఇలా ఉన్నాయి.
15 ఏళ్లు అంతకంటే ఎక్కువగా వాడుకలో ఉన్న ప్రైవేట్ వాహనంకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ద్విచక్ర వాహనాలకైతే ప్రస్తుతం ఉన్న రూ.300 నుంచి రూ.1000కి పెరిగే అవకాశాలుండగా... అదే కార్లకు అయితే ప్రస్తుతం ఉన్న రూ.600 నుంచి రూ.5000 వరకు పెరిగే అవకాశాలున్నాయి. దీనికి అదనంగా ఐదేళ్ల పాటు గ్రీన్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక రెండు కేసులు తీసుకున్నట్లయితే ఆటోమాటిక్ ఫిట్నెస్ టెస్టులో వాహనాలు కనుక విఫలమైతే... వాటిని వాహన్ అనే డేటా బేస్ నుంచి తొలగించబడుతుంది.
ప్రస్తుతం శాంక్షన్ అయిన 25 ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్టు కేంద్రాల్లో కేవలం 7 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. రెండు ఆథరైజ్డ్ స్క్రాపింగ్ కేంద్రాలు ఉండగా అందులో ఒకటి నోయిడాలో ఉంది. ఇక స్క్రాపింగ్ పాలసీల గురించి ఒక వాయిస్ మెసేజ్ రూపంలో అవగాహన తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. వాహన యజమాని యొక్క మొబైల్కు వాయిస్ మెసేజ్ పంపడంగానీ, పెట్రోల్ పంపులు కేంద్రంగా ప్రకటనలు ఇవ్వడం కానీ చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా దొంగలించబడ్డ వాహనాలకు స్క్రాపింగ్ పాలసీ అమలు కాకుండా చర్యలు తీసుకునేలా పగడ్బందీగా విధానాలను రూపొందిస్తున్నట్లు సమాచారం