కరోనా లాక్డౌన్ ఉన్నా..: వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు సీజ్, అరెస్ట్
ప్రకాశం: దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలవుతున్న వేళ ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి చెందిన నేత ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు లభించడం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు మండలం గడికోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు లభించాయి.

భారీగా మద్యం సీజ్..
కాగా, శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో గడికోట ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పక్కా సమాచారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, సీఐల నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో 1200 మద్యం సీసాలు, కారును సీజ్ చేశారు.

కర్ణాటక నుంచి తీసుకొచ్చారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఈ మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. కాగా, శ్రీనివాస్ రెడ్డి కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పిచ్చెక్కుతున్న మద్యం ప్రియులు..
దేశంలో కరోనావైరస్ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యావసరాలు, అత్యవసరాలకు సంబంధించినవి తప్ప మిగితా షాపులన్నీ బంద్ అయ్యాయి. మద్యం షాపులు కూడా బంద్ కావడంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మద్యం దొరక్క పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తుండటంతో వారి కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మద్యం దొరక్క పోవడంతో పలువురు స్థానికంగా దొరికే కల్లు తాగి సేద తీరుతున్నారు. మరికొందరైతే అన్నిటికీ తెగించి మద్యం షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇది ఇలావుండగా, ఏపీలో 300లకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications