ఘోర రోడ్డు ప్రమాదం: కారులో మంటలు ఎగిసిపడటంతో ముగ్గురు సజీవదహనం
ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కంబం నుంచి శ్రీశైలం వెళుతున్న కారు టైరు పేలడంతో జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న మార్కాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కారు డ్రైవర్ను చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన రావూరి తేజ(35)గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.
చోరీకి వచ్చిన దొంగను చితకబాదారు, ఆస్పత్రిలో మృతి
దొంగతనానికి వచ్చిన ఓ దొంగ తన ప్రాణాలు కోల్పోయాడు. దొంగన పట్టుకుని దేహశుద్ధి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. గూడూరు తిలక్ నగర్లో మంగళవారం తెల్లవారుజామున దొంగ ఇంట్లోకి ప్రవేశించటంతో ఇంటి యజమానులకు మెలుకువ వచ్చి అడ్డుకున్నారు.
దొంగ తన వద్ద ఉన్న ఆయుధాలతో ప్రతిఘటించడంతో ఇంటి యజమానులు ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. భయాందోళనకు గురైన వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని దొంగను పట్టుకున్నారు. అంతా కలిసి దొంగను కట్టేసి తీవ్రంగా కొట్టారు.
ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్ధానికుల దాడిలో గాయపడిన దొంగను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దొంగ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దొంగ హిందీ భాషలో మాట్లాడుతుండటంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాడుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.