వైసీపీకి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గుడ్బై: క్లారిటీ ఇచ్చిన ఎంపీ
ఒంగోలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్యవహారం కొద్దిరోజులుగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మాగుంట త్వరలో పార్టీ మారబోతోన్నారని, తెలుగుదేశం లేదా భారతీయ జనతా పార్టీల్లో ఆయన చేరబోతోన్నారనే ప్రచారం సాగింది. ఆయన వ్యవహార శైలి పట్ల అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కొంత కలకలానికి దారి తీసింది.
దీనిపై మాగుంట స్పందించారు. తాను పార్టీ మారబోవట్లేదంటూ స్పష్టం చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు. ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలోకి కావడానికి సంసిద్ధంగా ఉన్నారని, దీన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రారంభిందని విమర్శించారు. జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న విభేదాలను ఆయన ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, మాగుంట కుటుంబం విశ్వసనీయతకు మారుపేరు అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాను అడ్డుగా పెట్టుకుని ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మాగుంట కుటుంబం పార్టీ మారుతదంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వైఎస్ జగన్తో మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ లేని వార్తలను పుట్టిస్తోన్నారని చెప్పారు.
పార్టీ మారబోయే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో కూడా మాగుంట కుటుంబం వైఎస్ఆర్సీపీ నుంచే పోటీ చేసి గెలుస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కుటుంబానికి అభిమానులుగా, శ్రేయోభిలాషులుగా ఉన్నామని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులతో కూడా తన కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. తాము అందరం కలిసే పని చేస్తున్నామని వివరణ ఇచ్చారు. టీడీపీ చేసే దుష్ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు.