కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో భాయనక వాతావరణం
కాకినాడ రూరల్ పరిధిలోని వలసపాకల పంచాయతీ వద్ద ఉన్న కేంద్రీయ విద్యాలయంలో భయానక వాతావరణం చోటుచేసుకుంటోంది. సమీపంలోని పరిశ్రమ నుంచి విష వాయువులు వెలువడుతుండటంతో చిన్నారులు అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాలయానికి వచ్చి పిల్లల్ని ఇంటికి తీసుకువెళుతున్నారు.
ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ప్రార్థన ముగిసిన తర్వాత తరగతి గదుల్లోకి వెళ్లారు. 5, 6 తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఊపిరి ఆడటంలేదంటూ ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే అపస్మారకస్థితికి చేరుకుంటుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పోలీసులు, ఇతర అధికారులు కేంద్రీయ విద్యాలయానికి చేరుకొని కారణాలను అన్వేషిస్తున్నారు.
గతంలో కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు పరిశ్రమల నుంచి విషవాయువులు లీకై స్థానికులు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈసారి విద్యార్థులపై ప్రభావం చూపడంతో విషవాయువులు లీకైన పరిశ్రమకు అన్ని అనుమతులున్నాయా? లేవా? అని అధికారులు తనిఖీ చేస్తున్నారు.