జలగల్లా పీడిస్తోన్న 49 మంది వడ్డీ వ్యాపారుల అరెస్ట్, రూ.65 లక్షలు స్వాధీనం
గోదావరిఖని : వడ్డీకి డబ్బులిచ్చి జలగల్లా పీడిస్తోన్న వ్యాపారులపై పోలీసులు కొరఢా ఝుళిపించారు. లైసెన్స్ లేకుండా వడ్డీ ఇస్తోన్న 49 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. వీరు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వడ్డీ వ్యాపారం చేస్తూ .. నగదు తీసుకున్నవారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు.
బాండ్ పేపర్లు ..
వడ్డీ వ్యాపారుల నుంచి 65.52 లక్షల నగదు, బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీటితోపాటు డబ్బులు తీసుకునే సమయంలో బాధితులు ఇచ్చిన ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డు, పట్టాదారు పాసు పుస్తకాలను కూడా తీసుకున్నట్టు సీపీ తెలిపారు. వీరేగాక మరో 70 మంది వడ్డీ వ్యాపారులు పారిపోయారని .. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

అధిక వడ్డీతో విరుగుతున్న నడ్డి
రామగుండంలో వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు ఫైనాన్స్ చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని వివరించారు. నగదు ఇచ్చే సమయంలో ప్రాంసరీ నోట్లు, బాండ్ పేపర్లు రాయించుకోవడంతోపాటు ఏటీఎం కార్డులు, పట్టా పాసుపుస్తకాలు కూడా తాకట్టు పెట్టుకుంటారనే విషయం వెలుగుచూసింది. తమ అవసరాల నిమిత్తం అప్పు తీసుకొని .. తిరిగి చెల్లించలేక చాలా మంది ఇబ్బందిపడుతున్నారని సీపీ పేర్కొన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్రమంగా సాగుతున్న వడ్డీ వ్యాపారులపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టు వివరించారు. వడ్డీ వ్యాపారుల నుంచి 1235 ప్రాంసరీ నోట్లు, 1019 బ్లాంక్ చెక్కులు, 347 ఏటీఎం కార్డులు, 175 బాండ్ పేపర్లు, 23 భూమి పత్రాలు, 9 పట్టాదారు పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ .. అనుమతి లేని వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పరారీలో ఉన్నవారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని స్పష్టంచేశారు. వడ్డీ వ్యాపారం చేసేవారు .. లైసెన్స్ తీసుకొని, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ చేయాలే తప్ప .. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని .. చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications