కారుకు ఇండిపెండెంట్ టక్కర్... ఆ అభ్యర్థి వల్లే టీఆర్ఎస్ ఓడిందా..?
ఉద్యమ సమయంలో... ఆ తర్వాత... ఎన్నో ఉపఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొన్న టీఆర్ఎస్ పార్టీకి 'దుబ్బాక' ఫలితం ఊహించని శరాఘాతం. లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని ప్రకటించుకున్న ఆ పార్టీ చివరకు వెయ్యి ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అతి విశ్వాసమో... ప్రజా వ్యతిరేకతో... మొత్తానికి టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ రూపంలో గట్టి బ్రేక్ పడింది. దీంతో ఒక్కసారిగా అంతర్మథనంలో పడాల్సిన పరిస్థితి. లెక్క ఎక్కడ తప్పిందో సరిచూసుకుంటామని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
మరోవైపు టీఆర్ఎస్ ఓటమి పట్ల రకరకాల విశ్లేషణలు,వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆశ్చర్యంగా... ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి టీఆర్ఎస్ ఆశలను గల్లంతు చేశాడన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా విషయమంటే... దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బండారు నాగరాజు అనే వ్యక్తి 'రోటీ మేకర్' గుర్తుపై పోటీ చేశారు. ఉపఎన్నికలో ఆయనకు దాదాపు 3500 ఓట్లు పోలయ్యాయి. నిజానికి ఈ 3500 ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో పడాల్సినవని... రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉండటంతో కొంత నష్టం జరిగిందని అధికార పార్టీ మద్దతుదారులు అంటున్నారు. అయోమయానికి గురైన కొందరు ఓటర్లు కారు గుర్తుకు బదులు రోటీ మేకర్కు ఓటేశారని చెప్తున్నారు. ఆ ఓట్లు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడి ఉంటే ఫలితం మరోలా ఉండేదంటున్నారు.

Recommended Video
ఏదేమైనా టీఆర్ఎస్ ఉపఎన్నికలో ఓడిపోయింది. అటు మంత్రి కేటీఆర్ హుందాగా ఓటమిని అంగీకరించారు. ఓటమిని సమీక్షించుకుంటామని చెప్పారు. ఒకవేళ బీజేపీ అక్కడ స్వల్ప తేడాతో ఓడిపోయినా నైతికంగా తామే గెలిచామని చెప్పుకునేది. ఒకవేళ టీఆర్ఎస్ స్వల్ప మెజారిటీతో గెలిచినా... చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్నట్లుగా పరిస్థితి ఉండేది. కాబట్టి ఇండిపెండెంట్ వల్లే ఓడిపోయామన్న వాదనకు పెద్దగా బలం లేదు. ఏదేమైనా ఈ ఎన్నికతో తెలంగాణ భవిష్యత్ రాజకీయం ఏ వైపు టర్న్ తీసుకోబోతుందన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.












Click it and Unblock the Notifications