దుబ్బాక ఉప పోరులో రాములమ్మ..? ఆమె వైపే హైకమాండ్ మొగ్గు.. పోటీకి విజయశాంతి సై..?
దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో జెండా ఎగరేయాలని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఇందుకోసం బలమైన అభ్యర్థులన బరిలోకి దింపుతున్నాయి. బీజేపీ నుంచి రఘునందన్ రావు పేరు వినిపిస్తోండగా.. కాంగ్రెస్ నుంచి ఫైర్ బ్రాండ్ రాములమ్మ విజయశాంతి పేరు పరిశీలనలో ఉంది. పోటీ చేసేందుకు విజయశాంతి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ టీఆర్ఎస్ పార్టీలో మాత్రం టికెట్ కేటాయింపు అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
ఫైర్ బ్రాండ్..
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన విజయశాంతి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు. మెదక్ ఎంపీగా ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లాపై మంచి పట్టుంది. నియోజకవర్గంలో చాలా వరకు పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. ఇవీ తమ విజయానికి నాంది పలుకుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దుబ్బాక ఉప పోరులో విజయశాంతి కన్నా బలమైన నేత ఎవరూ లేరు అని పార్టీ భావిస్తోంది. అందుకే ఆమె అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపుతోంది. దీనిపై అధికార ప్రకటన ఎప్పుడైనా వెలువడవచ్చు
అప్పుడు ఓడినా..
2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయశాంతి పోటీ చేసి ఓడిపోయారు. కానీ దుబ్బాకలో పరిస్థితి వేరు అని భావిస్తోన్నారు. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. ఉప ఎన్నికల్లో విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తుంది. పార్టీ ఆశించినట్టే విజయశాంతి కూడా నడుచుకుంటున్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడ్డారు. ఏ చిన్న తప్పిదాన్ని అయినా ఎత్తిచూపే విజయశాంతి.. ఉప పోరుకు సిద్దమని సంకేతాలను ఇస్తోన్నారు.
Recommended Video
అసమ్మతి కలిసి వస్తోందని అంచనా...
కాంగ్రెస్ అంచనా ఇలా ఉంటే.. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తారు. ఆయనకే టికెట్ వచ్చే అవకాశాలు మెండు అని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ సీటుపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఇటీవల చనిపోయిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ సుముఖంగా లేదు. దీనికితోడు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు పొసగనివ్వడం లేదు. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేకత వస్తోంది. దీనిని తాము క్యాష్ చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. టీఆర్ఎస్లో నెలకొన్న అనిశ్చితి, ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ క్యాడర్, విజయశాంతి ఇమేజ్ తమకు కలిసి వస్తోందని అంచనా వేస్తోంది.