అమ్మవారి ఆలయంలో చోరీకి కన్నం వేశాడు... ఆ కన్నంలోనే ఇరుక్కుపోయిన దొంగ వీడియో వైరల్!!
ఓ దొంగ ఓ చిన్న ఆలయంలో చోరీ చేయడానికి పక్కాగా ప్లాన్ వేసాడు. ఆలయంలోని విలువైన వస్తువులను దోచుకోవడం కోసం పథకం పన్నిన సదరు దొంగ చోరీ చేసి తప్పించుకునే క్రమంలో తాను వేసిన కన్నంలోనే ఇరుక్కుపోయి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం దొంగ కన్నంలో ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ చోరీ
64 కళల్లో ఒక కళగా చోర కళను చెబుతుంటారు. ఇక ఈ కళలో ఆరితేరటం అంత ఈజీ కాదు. పొరపాటున పట్టుబడితే జనాలతో దేహశుద్ధి తప్పదు. అందుకే దొంగతనం చేసే వాళ్ళు పట్టుబడకుండా జాగ్రత్తగా చోరీకి ప్రయత్నిస్తుంటారు. పట్టుబడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి అదృష్టం అడ్డం తిరిగితే వాళ్ళు వేసిన కన్నం లోనే ఇరుక్కొని బయటకు రాలేక నానా అవస్థలు పడుతూ అడ్డంగా బుక్ అవుతారు. ఇక అటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే
అమ్మవారి ఆలయానికి కన్నంవేసి ఆ కన్నంలోనే ఇరుక్కుపోయిన దొంగ
శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం జాడుపూడి గ్రామం లో జామి ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఊరికి దూరంగా ఉన్న ఈ అమ్మవారి ఆలయంలో ఉన్న అమ్మవారి నగలపై కంచిలికి చెందిన పాపారావు కన్నేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఆలయం గోడకున్న చిన్న కిటికీకి కన్నం వేసి ఆలయం లోపలికి చొరబడ్డారు. జామి ఎల్లమ్మ విగ్రహానికి ఉన్న బంగారు ఆభరణాలు, వెండి దొంగిలించి మళ్లీ ఏ విధంగా అయితే లోపలికి వెళ్ళాడో అదేవిధంగా బయటకు రావాలని ప్రయత్నించాడు. అయితే ఆ కిటికీ లోపలి నుంచి బయటకు రాలేక నానా ఇబ్బందులు పడ్డాడు. శరీరంలో సగ భాగం వరకు బయటకు వచ్చిన దొంగ మిగతా భాగం బయటకు రాక, మళ్లీ లోపలికి కూడా పోలేక ఆ కన్నంలో ఇరుక్కుపోయి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
దొంగ కన్నంలో ఇరుక్కుపోవటం గుర్తించిన గ్రామస్తులు .. పోలీసులకు ఫిర్యాదు
ఇక పాపారావు దొంగిలించిన చేతిలోని బంగారం, వెండి గుడి బయట కింద పడిపోయాయి. ఇక కిటికీలో ఇరుక్కుపోయిన పాపారావును అటుగా వచ్చిన గ్రామస్తులు చూశారు. ఆలయం సమీపంలోని కింద ఉన్న ఆభరణాలను చూసి గ్రామస్తులంతా షాక్ తిన్నారు. పాపా రావు చేసిన పని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, పాపారావును తిట్టిపోశారు. అమ్మవారి నగలు దొంగతనానికి ప్రయత్నిస్తావా అంటూ మండిపడ్డారు. ఇక ఏం చేయాలో అర్థం కాని పాపారావు తనను కిటికీ నుంచి బయటకు తీయమని గ్రామస్తులను వేడుకున్నాడు. పాపారావు దొంగతనానికి ప్రయత్నించిన క్రమంలో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు... వైరల్ గా మారిన వీడియోపై నెటిజన్లు సెటైర్లు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కన్నం లో ఇరుక్కుపోయిన పాపారావును బయటకు తీసి, కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. కొందరు దేవుడికే కన్నం వేయాలని చూస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు అమ్మవారి మహిమ వల్ల నగలు పోకుండా, దొంగ అక్కడ ఇరుక్కుపోయాడు అని మాట్లాడుతున్నారు. ఇంకొందరు ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని, తాను తీసుకున్న కన్నంలో తానే ఇరుక్కుపోయాడు సదరు దొంగ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.