ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి ఆన్ ఫైర్: మేం వెధవలమా?: మీకు ఫైవ్స్టార్ హోటళ్లు
శ్రీకాకుళం: గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధుల పరిపాలన ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందనడానికి నిదర్శనం ఈ ఘటన. 2018లో అప్పటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగలేదు. ఫలితంగా- ఈ మూడేళ్ల కాలంలో గ్రామ స్థాయిలో సమస్యలు పేరుకుపోయాయి. వాటిని ప్రక్షాళన చేయడం ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కొత్త సవాల్ను విసురుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించాల్సిన అవసరం వారికి ఏర్పడింది.
సమస్యల పరిష్కారం సవాల్గా
గ్రామస్థాయిలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయడానికి ప్రజల్లో చొచ్చుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అలాంటి ఉదంతమే ఇది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య తమ్మినేని వాణిశ్రీ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతోన్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.
నాణ్యత రహితంగా.. నామ్ కే వాస్తేగా అందుతోన్న భోజనం పట్ల ఆమె ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు ఫోన్లో సంబంధిత అధికారిపై నిప్పులు చెరిగారు. అధికారులు ఫైవ్స్టార్ హోటళ్లలో తింటూ పిల్లలకు రుచీ, పచీలేని ఆహారాన్ని అందజేస్తోన్నారని ఆరోపించారు.
తొగరం సర్పంచ్గా
తమ్మినేని వాణిశ్రీ.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం పరిధిలోని తొగరం సర్పంచ్గా ఆమె అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన పంచాయతీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యత లేని ఆహారాన్ని పంపిణీ చేస్తోండటం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, హెచ్చరించారు.
సాంబారా? నీళ్లా
విద్యార్థుల భోజనానికి ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంటే.. నాణ్యత లేని ఆహారాన్ని ఎందుకు సరఫరా చేస్తోన్నారంటూ ఆమె మండిపడ్డారు. విద్యార్థులకు ఇచ్చింది సాంబారా? నీళ్లా? అనేది అర్థం కావట్లేదని అన్నారు. మీ ఇంట్లో ఇలాంటి భోజనమే తింటారా?.. అని ప్రశ్నించారు. మొన్నే తాను పిలిచి వార్నింగ్ ఇచ్చినా.. తీరు మార్చుకోలేదని చెప్పారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృఫ్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.
పులిహోర, కిచిడీ అంటూ ఇచ్చే ఆహారాన్ని తిన్న పిల్లలకు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో అధికారులు ఫైవ్ స్టార్ హోటళ్లలో తింటూ పిల్లలకు కనీస నాణ్యత లేని ఆహారాన్ని ఇస్తోన్నారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయబోనని, కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు.