AP Panchayat Elections: అచ్చెన్న స్వగ్రామంలో పోలింగ్ సరళి ఎలా ఉందంటే? 40 ఏళ్ల తరువాత ఓటు
శ్రీకాకుళం: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ఆరంభమైంది. కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలో చోటు చేసుకున్నప్పటికీ.. మెజారిటీ గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని ఒకట్రెండు పంచాయతీల్లో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలం చిన్నజగ్గం పేట, చిత్తూరు జిల్లాలోని కమ్మకండ్రిగ, ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం పరిధిలోని ఒకట్రెండు గ్రామాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్నట్లు సమాచారం.
అచ్చెన్నాయుడు స్వగ్రామంలో
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నిమ్మాడపై ప్రస్తుతం అందరి చూపులు నిలిచాయి. అచ్చెన్నాయుడి అరెస్టుకు దారి తీసిన ఈ పంచాయతీ పరిధిలో పోలింగ్ సజావుగా సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కింజరాపు అప్పన్న సర్పంచ్ పదవికి పోటీ చేస్తోన్నారు. ఉదయం 9 గంటల వరకు 23 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. తొలివిడత ఎన్నికలకు ముందు నుంచే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలను చేపట్టారు.
40 సంవత్సరాల తరువాత..
పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిమ్మాడలో అచ్చెన్నాయుడి కుటుంబం 40 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా గెలుస్తూ వస్తోంది. కింజరాపు కుటుంబ సభ్యులు, బంధువులు సర్పంచ్గా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ఆనవాయితీకి ఈ సారి బ్రేక్ పడింది. వైఎస్సార్సీపీ తరఫున కింజరాపు కుటుంబానికే చెందిన అప్పన్న నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యమైంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిపై కింజరాపు అప్పన్న నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేయడాన్ని అడ్డుకోవడంలో భాగంగా బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంతో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించింది.
పోలింగ్ ముందు నుంచే ఉద్రిక్తత
నామినేషన్ల దశ నుంచే ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో నిమ్మాడను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తోన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధం అయ్యారు. రాత్రి వరకూ పోలిసులు పర్యవేక్షణ కొనసాగబోతోంది. సర్పంచ్ ఎన్నిక అనంతరం కూడా ఘర్షణలు చోటు చేసుకోవచ్చనే అనుమానంతో ముందుజాగ్రత్త చర్యగా.. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసేంత వరకూ భద్రత కొనసాగించనున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
మరోవంక- చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఓటర్ స్లిప్పుల మీద ఏ పార్టీకి ఓటు వేయాలనేది ముందే రాసి ఇస్తున్నారంటూ వారు నిరసనలకు దిగారు. దీనితో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని, వారిని శాంతింపజేశారు. తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ దాడులు చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందింది. తూర్పు గోదావరి జిల్లాలో కత్తులతో దాడులకు పాల్పడటంతో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.