వైఎస్ జగన్ దూకుడు - మరోసారి ఉత్తరాంధ్రలో..!!
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫుల్ జోష్లో కనిపిస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఆయన మరింత దూకుడుగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. సభ విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు అటు భారతీయ జనత పార్టీ రాష్ట్రశాఖ నాయకులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
మోదీ సభ అనుకున్నదాని కంటే గ్రాండ్ సక్సెస్ అయిందంటూ బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. ఈ విషయంలో వారు వైఎస్ జగన్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. మోదీ సభను విజయవంతం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి చాలా ఉందంటూ విశాఖపట్నానికే చెందిన మాజీ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు అభినందించారు. మంత్రులు, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు కష్టపడ్డారని కితాబిచ్చారు.

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ మరోసారి ఉత్తరాంధ్ర గడ్డ మీద అడుగు పెట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 25వ తేదీన నరసన్నపేటకు రానున్నారు. ఈ నియోజకవర్గంలో జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష రెండో విడత పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని తామరాపల్లిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్కు సమాచారం అందింది.
ఇదే విషయంపై నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ను కలెక్టర్ శ్రీకేశ్ బీ లత్కర్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించారు. సభా నిర్వహణ, హెలీప్యాడ్కు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి సోమవారం తామరాపల్లిలో పర్యటించనున్నారు. బహిరంగ సభను నిర్వహించడానికి తామరాపల్లి అనుకూలంగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications