వారిద్దరిపై ఈ సారి వైఎస్ జగన్ ఏ కామెంట్స్ చేస్తారో - జిల్లా రాజకీయాల్లో చర్చ..!!
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేరు మార్చారు. టాప్ గేర్లో దూసుకెళ్తోన్నారు. జిల్లాల పర్యటనలతో జనం మధ్యే ఉంటోన్నారు. రెండు రోజుల కిందటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారాయన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆక్వా వర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్కు శంకుస్థాపన చేశారు. దీనితో పాటు 1,400 కోట్ల రూపాయలతో వ్యయంతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శిలాఫలకం వేశారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ విజయవంతమైంది.
మీ భూమి - మా హామీ
తాజాగా ఇవ్వాళ వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర గడ్డ మీద అడుగు పెట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేటకు రానున్నారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్ష రెండో విడత పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి మీ భూమి - మా హామీ అని పేరు పెట్టింది ప్రభుత్వం. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 11 గంటలకు నరసన్నపేటకు వెళ్తారు.
ఇదీ షెడ్యూల్..
ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. లబ్ధిదారులకు శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:25 నిమిషాలకు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3:25 నిమిషాలకు తాడేపల్లికి చేరుకుంటారు. ఈ సభ విజయవంతం చేయడానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, శ్రీకాకుళం జిల్లా పాలన యంత్రాంగం అన్ని ఏర్పాటు పూర్తి చేసింది.
అత్యాధునిక సాకేంతికత..
2020 డిసెంబర్ 21వ తేదీన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. వంద సంవత్సరాల తరువాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ఇది. డ్రోన్లు, జీఎన్ఎస్ఎస్ రోవర్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్రంగా భూములను రీసర్వే చేయనుంది ప్రభుత్వం. ఈ తరహా వ్యవస్థను చేపట్టిన మొదటి రాష్ట్రం.. ఏపీ. భూహక్కు పత్రాన్ని లబ్దిదారులకు అందించడం ద్వారా వారికి శాశ్వత భద్రత కల్పించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో 350 గ్రామాల్లో 1,40,775.13 ఎకరాల విస్తీర్ణం మేర రీసర్వే పూర్తయింది. భూ హక్కు పత్రాలను పొందడానికి 1,12,290 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. 48,404 భూ హక్కు పత్రాలను ముద్రించారు. దీనితో పాటు గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని వైఎస్ జగన్ ఇవ్వాళ నరసన్నపేట సభలో వెల్లడించే అవకాశం ఉంది.
వారిద్దరిపై విమర్శలు..
సాధారణంగా- వైఎస్ జగన్ తన బహిరంగ సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు సంధిస్తుంటారు. ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు అంటూ చురకలు అంటిస్తుంటారు. నరసాపురం సభలోనూ జనసేనను రౌడీసేనగా అభివర్ణించారాయన. ఇప్పుడు నరసన్నపేట సభలో ఎలాంటి వ్యాఖ్యలు, విమర్శలు చేస్తారనే విషయంపై జిల్లా రాజకీయాల్లో చర్చ సాగుతోంది.