నాడు గుండె నిండా ధైర్యం ఉందని గర్జించాడు- నేడు బేలతనం బయటపెట్టుకున్నాడు
శ్రీకాకుళం: జనసేన పార్టీ- యువ శక్తి బహిరంగ సభ జోష్ లో ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద సుమారు రెండు లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనడానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం రాత్రే విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం రణస్థలానికి బయలుదేరి వెళ్లారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు సహా పలువురు సీినియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు.
బేలతనం..
ఈ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అదే స్థాయిలో చర్చనీయాంశమౌతోన్నాయి. జనసేన పార్టీని స్థాపించిన మొదట్లో కనిపించిన ఫైర్ ఇప్పుడు లేదనేది ఈ సభతో స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యం ఉంది.. అంటూ గర్జించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు వీరమరణం పొందాల్సిన అవసరం లేదంటూ తన బేలతనాన్ని చాటుకున్నారని అంటున్నారు.
వ్యక్తిగత విమర్శలకే..
ఈ సభలో కూడా ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. యువతకు స్ఫూర్తిప్రదాతగా చెప్పుకొనే స్వామి వివేకానందుడి జయంతి నాడు అదే యువతను పార్టీ వైపు ఆకర్షితులను చేయడానికి ఉద్దేశించిన ఈ సభలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఓ మహిళా మంత్రి, రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రోజాను డైమండ్ రాణి అంటూ సంబోధించడం పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని బయటపెట్టిందంటూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
అదే చెప్పుల భాష..
తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే- తన జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతానని, వీర మహిళ చెప్పు తీసుకుని కొడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు పవన్ కల్యాణ్. ఇది గతంలోనూ వాడిన పదాలే. తనను ఇలా దుర్భాషలాడే వారిని, ఎప్పటికీ మర్చిపోనని, జన సైనికులు కూడా మర్చిపోరని, అన్నీ గుర్తు పెట్టుకుంటారని హెచ్చరించడం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఖైదీ నంబర్ తో సంబోధించడం ఆయనలోని ఈర్ష్యాధ్వేషాలకు అద్దంపట్టిందనే వాదనలు లేకపోలేదు.
ప్రజలపై నమ్మకం లేదా..
వచ్చే ఎన్నికల్లో తాను ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోనని, గెలిపిస్తాననే గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించడం షాకింగ్గా భావిస్తోన్నారు. తన సభలకు వచ్చిన వారు తనకు ఓటు వేయరనే నమ్మకం పవన్ కల్యాణ్ లో బలంగా నాటుకు పోయిందని, ఆ కారణంతోనే చివరికి ప్రజలపైన కూడా విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితికి వచ్చాడని అంటున్నారు.
వీరమరణం పొందాల్సిన అవసరం లేదు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసి, వీరమరణం పొందాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ చెప్పడం- తెలుగుదేశం పార్టీలాగే ఆయన కూడా పొత్తుల కోసం తాపత్రయ పడుతున్నాడనడానికి నిదర్శనమనే అంచనాలు ఉన్నాయి. జనాలను నమ్ముకుని తాను రాజకీయాల్లోకి దూకానని, వారే తనను మధ్యలో వదిలేశారంటూ ప్రజలను నిందిచడం సరికాదని, వారి విశ్వాసాన్ని పొందగలిగేలా వ్యవహరించాల్సి ఉంటుందే తప్ప- అసహనం వ్యక్తం చేయడంలో అర్థం లేదని చెబుతున్నారు.