అయ్యో పాపం:శ్రీకాకుళంలో దారుణం - స్మశానవాటికకు మృతదేహం బైకుపై తరలింపు..!
శ్రీకాకుళం: కరోనా వైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఎటు చూసినా కరోనా పేషెంట్లు, కరోనా బారిన పడి మృతి చెందిన వారే కనిపిస్తున్నారు. ఆక్సిజన్ దొరక్క కొందరు మరణిస్తుంటే... హాస్పిటల్స్లో అడ్మిట్ చేసుకోకపోవడంతో ఇబ్బందులు పడి మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా క్రమంగా దారితప్పుతోంది. కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో పడకలు దొరకడం లేదు. మరికొన్ని చోట్ల ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతోంది. విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ దొరక్క పలువురు మృతి చెందిన వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆక్సిజన్ పైపులు లీకేజీతో కూడా మరికొందరు మృతి చెందుతున్నారు. దీనికి తోడు అంబులెన్స్ కష్టాలు కూడా ఉండటంతో పుండు మీద కారం చల్లినట్లుగా తయారైంది కోవిడ్ రోగుల పరిస్థితి.
శ్రీకాకుళంలో దారుణం..
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగిన ఘటన తెలిస్తే మనసు తరుక్కుపోతుంది. కరోనా సోకి ఓ మహిళ మృతి చెందింది. అయితే మహిళ మృతదేహాన్ని స్మశాన వాటికకు చేర్చేందుకు అంబులెన్స్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లిన ఘటన పలువురిని కలచివేసింది. ఇక మృతురాలికి కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే కోవిడ్ టెస్టు చేయించింది. రిపోర్టు రాకముందే ఆ మహిళ కన్నుమూసింది. అంటే కరోనా వ్యాధి నిర్థారణ కోసం పరీక్ష చేయించగా... దాని ఫలితం వచ్చేందుకు కూడా సమయం పడుతోంది. ఇవే ఫిర్యాదులు పలు జిల్లాల్లో వస్తున్నాయి.
అంబులెన్స్ లేక పోవడంతో..
కరోనా తీవ్రం కావడంతో మందస మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి సోమవారం తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. అయితే ఇక నేరుగా స్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం చూశారు కుటుంబ సభ్యులు. ఇక అంబులెన్స్లు లేకపోవడంతో ఇతర వాహనాల కోసం వేచి చూశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో చేసేదేమీ లేక మృతురాలి కొడుకు అల్లుడు ఇద్దరు కలిసి వారి బైక్పై మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించారు.
భారీగా అంబులెన్స్లు కొనుగోలు
గతేడాది కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్లో విజృంభించిన నేపథ్యంలో అంబులెన్స్ కొరత తీవ్రంగా ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికి పైగా అంబులెన్స్లను కొనుగోలు చేసింది. అంతేకాదు 104 వాహనాలు కూడా కొనుగోలు చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా ఉండటంతో వీటి అవసరం మరింతగా ఉంది. సీఎం జగన్ కోవిడ్ పై ప్రత్యేక సమీక్షలు జరుపుతున్నారు. ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖకు ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా పడకల కొరత రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్తో మరణించినవారి అంత్యక్రియలు చేసేందుకు సహాయ సహకారాలు లభించకపోవడంతో ఆ కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పడం లేదు.