Srikakulam: కరోనా రూల్స్ బ్రేక్: పాస్టర్ల సువార్త ప్రేయర్లు: భారీగా జనం: పోలీసులు ఏంచేశారంటే?
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ దేశం మొత్తాన్నీ కమ్మేసింది. రోజూ వేలాదిమందిని పొట్టనబెట్టుకుంటోంది. మూడున్నర వేల నుంచి నాలుగు వేలకు పైగా రోజువారీ మరణాలు నమోదవుతోన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి నాలుగైదు రాష్ట్రాల మినహా మిగిలినవన్నీ లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి.
అన్ని రాష్ట్రాలు కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తోన్నాయి. ఏపీ కూడా దీనికి మినహాయింపు కాదు. పూర్తిస్థాయి లాక్డౌన్ను ప్రభుత్వం అమలు చేయనప్పటికీ- కర్ఫ్యూను విధించింది. మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ అమలవుతోంది. ఏ నలుగురూ గుమికూడటానికి అవకాశం లేదు.
ఈ పరిస్థితుల్లో కొందరు పాస్టర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ- పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. పరిస్థితులు అనుకూలించనప్పటికీ, కరోనా నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ.. లెక్క చేయలేదు. సువార్త స్వస్థత కూటములను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. ఈ సమాచారం అందిన వెంటనే సీతంపేట ఎస్ఐ హైమావతి, ఇన్ఛార్జ్ ఎస్ఐ అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రేయర్లకు హాజరైన వారు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్డీఓ సమక్షంలో హాజరు పరిచారు. కోవిడ్ మార్గదర్శకాలు, ప్రొటోకాల్ను ఉల్లంఘించిన కారణంగా పాస్టర్లు, నిర్వాహకులపై లక్ష రూపాయల జరిమానా విధించారు అధికారులు.
తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ప్రేయర్లను తాము ఒక్కరోజుకు కుదించుకున్నామని నిర్వాహకులు వివరించారు. ఆ ప్రార్థనలను ఇంటి వద్దే చేసుకోవచ్చని, బహిరంగ నిర్వహించడం కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని అధికారులు చెప్పారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా చర్చ్లను తెరవడాని కూడా అనుమతి లేదనే విషయాన్ని వారు గుర్తు చేశారు.