శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి...
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం టైర్ పేలి బోల్తా కొట్టింది. ఆ వెంటనే అటుగా వస్తున్న లారీ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమచారం అందిన వెంటనే స్థానిక అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతులను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బొలెరో వాహనం రహదారిని క్రాస్ చేస్తున్న సమయంలో టైర్ పేలినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన లారీ వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జవడంతో మృతదేహాలు అందులోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం బైరిసారంగిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.ప్రమాద ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ఉన్న నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రయాణిస్తున్న కారు టైరు పేలి మృత్యువాత పడ్డారన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.
మరో ఘటనలో 26 ఏళ్ల మహేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన మహేష్... శుభలేఖలు పంచేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నెల 27న అతని వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే అతను మృత్యువాత పడటం కుటుంబ సభ్యులకు తీరని విషాదం మిగిల్చింది.సౌతాఫ్రికాలో పనిచేస్తున్న మహేష్.. పెళ్లి నిమిత్తం ఇటీవలే అక్కడి నుంచి అనంతపురం వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. త్వరలోనే మహేష్ ఓ ఇంటివాడు అవుతాడని కుటుంబ సభ్యులు సంతోషపడుతుండగా ఆ కుటుంబాన్ని అనుకోని విషాదం ముంచెత్తింది.












Click it and Unblock the Notifications