తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారికి గింగిరాలు తప్పవ్..!!
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి అక్రమాలను అడ్డుకోవడం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత గుర్తు చేశారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతోన్నారని, తాము అక్కడికి వెళ్తే.. 144 సెక్షన్ ఉందని అరెస్ట్ చేస్తోన్నారని అన్నారు.

మంత్రి అరాచకాలు..
కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరులతో మాట్లాడారు. పలాస-కాశీబుగ్గ వెళ్లడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు అరాచకాలు పెరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రధాన ప్రతిపక్ష నాయకులపై పోలీసులను ప్రభుత్వం ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.

వైసీపీకి వంత..
జిల్లాలోని అధికార, పోలీసు యంత్రాంగం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తొత్తులుగా మారిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. తమకు పరిచయం ఉన్న నాయకులను పట్టుకుని అనుకూలమైన పోస్టింగులు ఇప్పించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారని, అది జరగదని చెప్పారు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించిన అధికారులకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

గింగిరాలు తిప్పుతాం..
తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారుల పేర్లను ప్రొహిబిటరీ బుక్లో రాస్తామని, రాష్ట్రం మొత్తం బదిలీలు చేయిస్తూ గింగిరాలు తిప్పుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులను చూసి కొంతమంది పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలు, ఆక్రమణలు, దోపిడీలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

మంత్రులు దద్దమ్మలు..
వైఎస్ఆర్సీపీ నాయకుల ఆదేశాల మేరకు పోలీసులు ఎంతమంది టీడీపీ నాయకులను అరెస్ట్ చేయగలుగుతారని నిలదీశారు. ఎంతమంది మీద తప్పుడు కేసులు బనాయించి, జైలులో పెట్టగలరని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం పని చేస్తోన్న పోలీసు అధికారులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ఆక్రమణలకు పాల్పడుతున్న కొంతమంది చేతకాని దద్దమ్మ మంత్రులు తమను విమర్శిస్తోన్నారని, అధికార యంత్రాంగం తమ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు దర్యాప్తు జరపరని అన్నారు.

అఖండ విజయంతో
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆ భయంతోనే వైఎస్ జగన్ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయిస్తూ బలహీనపర్చడానికి, భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తోన్నాడని ఆరోపించారు. తమకు అరెస్టులు కొత్త కాదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కొంతమంది అధికారులు గంగిరెద్దుల్లా తల ఊపుతున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications