భయపెడుతోన్న చెత్త రికార్డ్: కివీస్పై గెలిచి 18 ఏళ్లయింది: భారత్ డూ ఆర్ డై మ్యాచ్: భువి అవుట్
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో మరో ఆసక్తికరమైన పోరాటానికి ఈ సాయంత్రం తెర లేవనుంది. సూపర్ 12 దశలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఈ రెండు ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ను కూడా గెలవలేదు. ఈ రెండు జట్లు కూడా తాము ఎదుర్కొన్న తొలి మ్యాచ్లో పాకిస్తాన్పైనే ఓడిపోయాయి.
18 ఏళ్ల కిందట..
న్యూజిలాండ్పై ఉన్న అత్యంత చెత్త రికార్డ్.. అభిమానులను భయపెడుతోంది. కలవర పెడుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన టోర్నమెంట్లల్లో బ్లాక్ క్యాప్స్పై భారత జట్టు గెలిచి 18 ఏళ్లయింది. ఆ తరువాత ఐసీసీ టోర్నీల్లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. టీ20 ప్రపంచకప్లో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో అదే న్యూజిలాండ్ను ఎదుర్కొంటోంది భారత జట్టు. పాత రికార్డును తిరగేస్తే మాత్రం ఓటమి తప్పదనే భావన అభిమానుల్లో కలుగుతోంది. దీనికి బ్రేక్ వేస్తుందా? లేక? కొనసాగిస్తుందా అనేది ఈ సాయంత్రం జరిగే మ్యాచ్తో తేలిపోతుంది.
చివరిసారిగా గెలిచిందెప్పుడు..?
న్యూజిలాండ్పై బారత్ జట్టు చివరిసారిగా 2003లో. ఆ సంవత్సరం నిర్వహించిన ప్రపంచకప్ టోర్నమెంట్లో బారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. నాటి జట్టుకు సౌరభ్ గంగూలి కేప్టెన్గా ఉన్నాడు. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ టీమిండియా.. న్యూజిలాండ్ను ఓడించిన మ్యాచ్లు లేవు. 2007లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్.. భారత్ను ఓడించింది. జొహాన్నెస్బర్గ్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 10 పరుగుల తేడాతో ఓడింది. టీ20 మ్యాచుల్లో
నాగ్పూర్లో మరో ఓటమి..
2016లో నిర్వహించిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో టీమిండియా మరోసారి కివీస్ చేతిలో ఓటమిని చవి చూసింది. నాగ్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 47 పరుగుల తేడాతో ఓడింది. 2019 నాటి విషయం మనకు గుర్తుండే ఉంటుంది. ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో పరాభవాన్ని అందుకుంది. ప్రపంచకప్ ఫైనల్లో అడుగు పెట్టలేకపోయింది. ఈ ఏడాదిలో సౌథాంప్టన్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మళ్లీ ఓడింది టీమిండియా.
ఇప్పుడు మళ్లీ బిగ్ ఫైట్..
ఇప్పుడు మళ్లీ అదే ఐసీసీ టోర్నమెంట్లో కివీస్ను ఢీ కొట్టబోతోంది. దీని ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఐసీసీ టోర్నమెంట్లతో పాటు మొత్తంగా భారత్-న్యూజిలాండ్ 18 సార్లు తలపడ్డాయి. విన్నింగ్ రేట్ 50:50గా ఉంటోంది. ఈ రెండు జట్లు తలా ఓ తొమ్మిది మ్యాచులను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా పాకిస్థాన్ చేతిలో పరాభవం నుంచి బయటపడాలని భావిస్తోంది. కివీస్ పరిస్థితి కూడా ఇంతే. గ్రూప్-2లో ఇప్పటికే పాకిస్థాన్ సెమీస్కు చేరుకుంది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి జోరుమీదుంది.
తుది జట్టు కూర్పు ఇలా ఉండొచ్చు..
న్యూజిలాండ్పై జరిగే మ్యాచ్లో ఆడే తుదిజట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఆడటానికి అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్ను పక్కన పెట్టి. అతను స్థానంలో శార్దుల్ ఠాకూర్ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. శార్దుల్ ఠాకూర్ ఆల్రౌండర్ హోదాలో బరిలోకి దిగనున్నాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో భారీ షాట్లతో విరుచుకు పడే సత్తా ఉండటం అతనికి ప్లస్ పాయింట్గా మారింది.