తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: రికవరీ డబుల్, 27వేలకు యాక్టివ్ కేసులు, పగటిపూట రిలీఫ్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 97,751 మంది నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. 1436 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,91,170కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం సాయంత్రం వివరాలను వెల్లడించింది.
Recommended Video
తెలంగాణలో కొత్త కేసులకంటే రికవరీ డబుల్..
గత 24 గంటల్లో కరోనా బారినపడి 14 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3,378కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా నుంచి 3614 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,60,776కు చేరింది. రాస్ట్రంలో రికవరీ రేటు 84.85 శాతంగా ఉంది. మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.
తెలంగాణలో 27వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
జీహెచ్ఎంసీ పరిధిలో 184 కరోనా కేసులు నమోదు కాగా, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 100కుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,58,61,242 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో 27,016 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఆదివారం నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. తొలి గంటలోనే ఇక్కడ 5వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకేచోట 40 వేల మందికి టీకా ఇచ్చేందుకు చేస్తున్న ఈ డ్రైవ్ దేశంలోనే మొదటిది కావడం గమనార్హం.
లాక్డౌన్ అమలుతోనే తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణలో మే 12 నుంచి లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతోనే కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో పగటిపూట లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే.
పగటిపూట రిలీఫ్ ఇచ్చే అవకాశం..
ఇక లాక్డౌన్ గడువు వచ్చే బుధవారంతో ముగియనుంది. ప్రస్తుం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం, పాజిటివిటీ రేటు 2 శాతమే ఉండటంతో పగటిపూటి పూర్తిగా సడలింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్ 9న సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో లాక్డౌన్పై నిర్ణయం తీసుకోనున్నారు.