రూ.10 వేల కోట్లు కేటాయించండి.. మంత్రి గంగులకు నేతల వినతి
బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయాలని బీసీ సంక్షేమం కోరుతోంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో ఆ సంఘం నేతలు కలిశారు. బీసీలకు కనీసం రూ.10 వేల కోట్లు కేటాయించాలని వారు కోరారు. తమ డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించారని.. సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారని ఆర్ కృష్ణయ్య మీడియాకు తెలిపారు.
ఈ నెల 18వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ ప్రారంభం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇదివరకు బీసీలకు అన్యాయం చేశారని ఆర్ కృష్ణయ్య అన్నారు. అలా మరోసారి చేయకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో మాట్లాడి జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్కు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు 5 వేల కోట్లు, ప్రతి నియోజకవర్గానికి రెండు గురుకుల పాఠశాలల చొప్పున 240 గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కోరారు.
Recommended Video
బడ్జెట్ కూర్పునకు సమయం ఉన్నందున బీసీలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. గత కొన్నేళ్లుగా తమకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ఈ పద్దులో న్యాయం చేయాలని కోరారు. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో మంత్రి గంగుల కమలాకర్ని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, ఉదయ్, చంద్రశేఖర్గౌడ్, చంటి ముదిరాజ్, లక్ష్మణ్ యాదవ్, జశ్వంత్ ఉన్నారు.