తెలంగాణలో కరోనా కల్లోలం: వెయ్యికిపై కొత్త కేసులు, 6వేలు దాటిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జూన్ తొలినాళ్లలో ఒక శాతానికి మించని పాజిటివిటీ రేట్... ఇప్పుడు దాదాపు మూడు శాతానికి చేరటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి మార్క్ను దాటింది.
గడిచిన 24 గంటల్లో 43,318 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 1,061 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం మహమ్మారి నుంచి 836 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 6,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్లో 401 కేసులు, రంగారెడ్డిలో 63, మేడ్చల్ మల్కాజిగిరిలో 56, నల్గొండ 51, రాజన్న సిరిసిల్ల 46, కరీంనగర్ 43 కొత్త కేసులు వెలుగుచూశాయి.

మరోవైపు, నల్గొండ జిల్లాలోని కస్తూర్బ పాఠశాలలో 17 మందికి కరోనా సోకింది. ఓ ఉపాధ్యాయురాలితోపాటు 16 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపిస్తే తప్పక నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కొవిడ్ మరణాలు సున్నాగా ఉండటం కొంత ఊరట కలిగిస్తున్న అంశం. కొవిడ్ వ్యాక్సిన్ ల ప్రభావం, గతంలో వైరస్ సోకిన వారిలో యాంటీ బాడీల ఉత్పత్తి వంటి అంశాలు కొవిడ్ మరణాలను కొంతవరకు నియంత్రిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, బూస్టర్ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.












Click it and Unblock the Notifications