సంచలనం: రెండు జిల్లాల్లో టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ! లీకేజి కాదు.. మాల్ప్రాక్టీస్: డైరెక్టర్
హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షకు అరగంట ముందే ఆదిలాబాద్, వనపర్తి జిల్లాలలో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకైంది. ఓ టీచర్ ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫోటో తీసి సర్క్యులేట్ చేసినట్లు సమాచారం.
ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తం అయింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నాలుగు పోలీసు బృందాలు విచారణ జరుపుతున్నాయి. మరోవైపు రెండు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఫోన్లో మాట్లాడారు.
లీకైన సెంటర్ల సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇక ప్రశ్నాపత్రం లీకేజీపై ఆదిలాబాద్ డీఈవో మాట్లాడుతూ.. వాట్సప్ ద్వారా క్వశ్చన్ పేపర్ను లీక్ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
నలుగురు అధికారులపై వేటు
మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో టెన్త్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నలుగురు అధికారులపై వేటు పడింది. ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఇద్దరు సూపర్ వైజర్లతో పాటు విద్యార్థులుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
లీకేజీ కాదు.. మాల్ ప్రాక్టీస్: విద్యాశాఖ డైరెక్టర్
పదో తరగతి పరీక్షల్లో సోమవారం రెండు చోట్ల మాల్ప్రాక్టీస్ ఘటనలు జరిగాయని పాఠశాల విద్యాకమిషనర్ కిషన్ తెలిపారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవాళ జరిగింది ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు కాదు.. మాల్ ప్రాక్టీస్ మాత్రమేనన్నారు. పదోతరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని, సోమవారం నాటి ఇంగ్లీష్ పేపర్-1 రద్దు చేయమన్నారు. మాల్ప్రాక్టీస్ ఘటనకు కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ఆదిలాబాద్ జిల్లా ఘటనలో నలుగురిని సస్పెండ్ చేశామని తెలిపారు.