నేను బక్కగా ఉండి కొట్లాడినా, ఆయన వల్లే తెలంగాణ వచ్చింది: కెసిఆర్
హైదరాబాద్: కొత్త రాష్ట్రాల ఏర్పాటు అధికారం కేంద్రానికే ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారని, ఆయన వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఇందుకు తెలంగాణ సమాజం ఆయనకు రుణపడి ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. అంబేడ్కర్ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు.
కెసిఆర్ బక్కగా ఉండి కొట్లాడినప్పటికీ... అంబేడ్కర్ రాజ్యాంగంలో రాశారు కాబట్టి మనం తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. దేశంలో ఏదైనా రాష్ట్రం విడిపోవాలంటే అధికారం ఎవరి చేతిలో ఉండాలనే విషయం రాజ్యాంగ రచన సమయంలోనే చర్చ జరిగిందన్నారు.
అధికారం కేంద్రానికి ఉండాలని అంబేడ్కర్ రాశారని, అందుకే ఇప్పుడు తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుతోందన్నారు. దళితుల్లో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని చెప్పారు. దళిత విద్యార్థుల కోసం 25 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.

దళితుల, మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రూ.8 కోట్లతో సెంటర్ ఫర్ దళిత్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముందు బుద్దుడు, ఆ తర్వాతే అంబేడ్కర్ అని, ఆ వెనుక సచివాలయం ఉంటుందని చెప్పారు. వరుసగా వీటిని నిర్మిస్తున్నామని చెప్పారు.
125 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ గార్డెన్ వద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడారు. ఈ రోజు అంబేడ్కర్ 125వ జయంతి అనే విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కెసిఆర్తో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వేదపండితులు పూజలు నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు గ్రానైట్ రాయిని వేసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ బూర నర్సయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్తోపాటు పలువురు దళిత నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... అంబేడ్కర్ ఎవరు బక్కగా ఉన్నాడో వారి పక్షాన నిలబడ్డాడని, కెసిఆర్ బక్కగానే ఉన్నాడని, కెసిఆర్ బక్కోడే అనగానే కడియం శ్రీహరి నవ్వుతున్నారని, బక్కగా ఉండి కొట్లాడానని, అంబేడ్కర్ గారి ఆశీర్వాదంతో తెలంగాణ సాధించుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications